‘మా’ ఎన్నికలపై మూడు రోజుల్లో క్లారిటీ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల గురించి గత నెల రోజుల్లో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు.. ఎన్నికలు జరిగేది ఎప్పుడో తెలియదు, ఇంకా నోటిఫికేషనే రాలేదు.. ఎన్నికలపై ఏ క్లారిటీ లేదు.. అంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రకటించేశాడు. మంచు విష్ణు సహా మరికొందరు అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వీడియోలు రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టారు. వాదోపవాదాలు.. ప్రకటనలు.. ఖండనలతో వ్యవహారం హోరెత్తిపోయింది. సెప్టెంబరులో ఎన్నికలు జరగొచ్చన్న అంచనా ఉంది కానీ.. దానిపై స్పష్టత అయితే లేదు.

‘ఎన్నికలు ఎప్పుడు’ అంటూ ప్రకాష్ రాజ్ ఆ మధ్య ట్వీట్ వేయడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కార్యవర్గం నుంచి ఈ విషయంలో ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. ఐతే ఈ విషయంలో సందిగ్ధతకు తెరదించాలని ‘మా’ పెద్దలు నిర్ణయించారు.

‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశాన్ని ఈ వారంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బుధవారం లేదా గురువారం ఈ సమావేశం జరగొచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో ఎప్పట్లా కార్యవర్గం కార్యాలయంలో కలవకుండా.. వర్చువల్‌గా ఈ మీటింగ్ జరపాలని నిర్ణయించారు.

‘మా’ సర్వ సభ్య సమావేశాన్ని ఎప్పుడు జరపాలి.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి.. సభ్యుల జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం మాటేంటి.. పెండింగ్‌లో ఉన్న జీవిత కాల సభ్యత్వాల సంగతేంటి.. వంటి అంశాలపై ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారట.

ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటు ‘మా’ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుతో పాటు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం కోసం న్యాయ సలహాదారు, ఆడిటర్‌ కూడా పాల్గొంటారట. కోవిడ్ మూడో వేవ్ రాకుంటే సెప్టెంబరులోనే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని సంఘం పెద్దలు భావిస్తున్నారు. ఏ నిర్ణయమైనా ‘ఈసీ’ సమావేశంలో తేలిపోతుందని అంచనా వేస్తున్నారు.