బాహుబలి నిర్మాతల బోల్డ్ డెసిషన్

‘బాహుబలి’ లాంటి భారీ చిత్రం తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఒక్కసారిగా రేంజ్ తగ్గించేశారు. మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ‘ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య’ అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన చిత్రమిది. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘మహేషింటి ప్రతీకారమ్’కు ఇది రీమేక్. ఐతే వెంకటేష్ దీనికి తనదైన టచ్ ఇచ్చాడు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో.. తమ సినిమాకు ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ చిత్ర నిర్మాతలు ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు.

‘ఉమా మహేశ్వరరావు ఉగ్రరూపస్య’ డిజిటల్ హక్కుల్ని నెట్ ప్లిక్స్ వాళ్లకు అమ్మేశారని.. డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్‌కు అగ్రిమెంట్ కుదిరిందని.. లాభాలకే సినిమాను అమ్మారని సమాచారం. త్వరలోనే ప్రిమియర్స్ డేట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా రేంజ్ ప్రకారం చూస్తే థియేటర్లలో మరీ ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. ఇలాంటి చిన్న స్థాయి, క్లాస్ సినిమాలకు వసూళ్లు మరీ ఎక్కువేమీ రావు. వెంకటేష్ తొలి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’కు ఎన్ని ప్రశంసలు వచ్చినా థియేటర్ల ద్వారా పెద్దగా ఆదాయం రాలేదు.
అందులోనూ లాక్ డౌన్ ప్రభావంతో రిలీజ్ మరీ ఆలస్యమయ్యేలా ఉంది. పైగా చాలా సినిమాలు రిలీజ్ కోసం లైన్లో ఉన్నాయి. కరోనా ప్రభావంతో థియేటర్లలో అనేక పరిమితుల దృష్ట్యా కొన్ని నెలల పాటు అంతగా రెవెన్యూ కూడా వచ్చేలా లేదు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందంటున్నారు.