‘విరాటపర్వం’ విడుదలపై క్లారిటీ!

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలతో పాటు కాస్త పేరున్న సినిమాలు కూడా ఓటీటీలోకే వచ్చాయి. తాజాగా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆయన బ్యానర్ లో తెరకెక్కిన మరో సినిమా ‘విరాటపర్వం’ కూడా ఓటీటీలోకి వస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో రానా స్వయంగా ఇన్వాల్వ్ అయినట్లు టాక్ వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో రానా డీల్ మాట్లాడుతున్నాడని.. దాదాపు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. దీంతో నెక్స్ట్ ఓటీటీలో రాబోయే పెద్ద సినిమా ‘విరాటపర్వం’ అంటూ కథనాలు ప్రచురించారు. కానీ ఇందులో నిజం లేదని తేల్చి చెబుతున్నారు చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల. గతంలో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా తెరకెక్కించిన వేణు రెండో సినిమా రానాతో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు దర్శకుడు. సినిమాకి మంచి రేటు వచ్చిందని.. దీంతో ఓటీటీకి అమ్మేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. సినిమాలో రానా, సాయి పల్లవిలకు సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్లు చెప్పారు. 1990లలో మావోయిస్టు ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.