డియర్ కామ్రేడ్ సంచలనం


రెండేళ్ల కిందట భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘గీత గోవిందం’ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ కలిసి నటించడం.. అద్భుతమైన పాటలు.. చక్కటి ప్రోమోలు ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సగం వరకు సినిమా ఆకట్టుకున్నా.. ద్వితీయార్ధంలో గాడి తప్పి ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చినా.. మెజారిటీకి రుచించలేదు.

దక్షిణాదిన నాలుగు భాషల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌‌గా నిలిచిన ‘డియర్ కామ్రేడ్’.. ఆ తర్వాత హిందీలో అనువాదమై అక్కడి ప్రేక్షకులను కట్టి పడేస్తుండటం విశేషం. తెలుగు సినిమాలను హిందీలో అనువాదం చేసి రిలీజ్ చేయడం ద్వారా బాగా పాపులర్ అయిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్.. గత ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసింది.

విడుదలై ఏడాదిన్నర తిరక్కుండానే ‘డియర్ కామ్రేడ్’ హిందీ వెర్షన్ ఏకంగా 250 మిలియన్ల మార్కును అందుకోవడం విశేషం. ఓ తెలుగు అనువాద చిత్రాన్ని హిందీలో 25 కోట్ల మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా తెలుగు నుంచి వెళ్లే మాస్ మసాలా సినిమాలకే భారీగా వ్యూస్ వస్తుంటాయి. ‘డియర్ కామ్రేడ్’ క్లాస్ మూవీ. పైగా ఇక్కడ డిజాస్టర్ అయింది. దాన్ని ఇంతగా ఆదరించడం అనూహ్యం.

హిందీలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు అనువాద చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉండటం ఈ సినిమాకు ఇంతటి ఆదరణ దక్కడానికి కారణం కావచ్చు. ఇలా తెలుగు చిత్రాలను యూట్యూబ్‌లో హిందీలో రిలీజ్ చేసి గోల్డ్ మైన్ ఫిలిమ్స్ కోట్లు సంపాదిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’కు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు.