టైటిల్ మారింది.. స‌ల్మాన్ భ‌య‌ప‌డ్డాడా?

స‌ల్మాన్ ఖాన్‌కు రంజాన్ పండుగ‌తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈద్‌కు క‌చ్చితంగా త‌న సినిమా రిలీజ‌య్యేలా చూసుకుంటాడ‌త‌ను. స‌ల్మాన్ తండ్రి స‌లీమ్ ఖాన్ ముస్లిం కాగా.. అత‌డి త‌ల్లి సుశీలా హిందువు. కానీ అత‌ను రంజాన్ పండుగ‌కే ప్ర‌యారిటీ ఇస్తుంటాడు. అప్పుడే కొత్త సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు.

ఈ ఏడాది ఈద్ స‌మ‌యానికి థియేట‌ర్లు మూత ప‌డి ఉన్న‌ప్ప‌టికీ.. ఓటీటీ ద్వారా రాధె సినిమాను స‌ల్మాన్ రిలీజ్ చేయ‌డం తెలిసిందే. వ‌చ్చే ఏడాది రంజాన్‌కు ఒక సినిమా రెడీ చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడు. ఫ‌ర్హాన్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్, పూజా హెగ్డే జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రాన్ని వ‌చ్చే ఈద్‌కు షెడ్యూల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఐతే ఈ చిత్రానికి ముందు క‌భీ ఈద్ క‌భీ దివాళి అనే టైటిల్ పెట్టారు. కానీ ఇప్పుడా పేరును మార్చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌ల్మాన్-పూజా చిత్రానికి భాయిజాన్ అనే టైటిల్ పెడుతున్నార‌ట‌. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని సంకేతాలు ఇచ్చేలా క‌భీ ఈద్ క‌భీ దివాళి అనే టైటిల్ బాగానే ఉంది కానీ.. ఇలాంటి టైటిల్ పెట్టి రంజాన్‌కు సినిమాను రిలీజ్ చేస్తే లేని పోని గొడ‌వ‌లు త‌లెత్తుతాయేమో అని చిత్ర బృందం భ‌య‌పడి టైటిల్ మార్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకే త‌న కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచిన భ‌జ‌రంగి భాయిజాన్ సినిమా పేరు నుంచి నుంచి భాయిజాన్ ప‌దాన్ని తీసుకుని కొత్త సినిమాకు పెట్టుకున్న‌ట్లున్నాడు స‌ల్మాన్.

ఈ సినిమాతో పాటు స‌ల్మాన్ అంతిమ్, టైగర్-3, కిక్-2 చిత్రాల్లో న‌టిస్తున్నాడు. భాయిజాన్ సినిమా విష‌యానికి వ‌స్తే.. పూజా హెగ్డేకు ఇది ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్రాజెక్టు. స‌ల్మాన్ సినిమాతో హిట్టు కొడితే బాలీవుడ్లో ఆమె మ‌ళ్లీ బిజీ అయ్యే అవ‌కాశ‌ముంది.