బుచ్చిబాబుకి సుకుమార్ భరోసా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రానుంది. ఓ పక్క దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ.. మరోపక్క సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మాతగా చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఎక్కువగా తన శిష్యులతోనే సినిమాలు తీస్తుంటారు సుకుమార్. నిజానికి సుకుమార్ తన శిష్యులను సెటిల్ చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏదొక రూపంలో వారికి అవకాశాలు వచ్చేలా చేస్తుంటారు.

ఈ ఏడాది ‘ఉప్పెన’తో హిట్ అందుకున్న బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడే. కానీ ఈ సినిమా వెనుకుండి అన్నీ నడిపించింది మాత్రం సుకుమార్ అనే చెప్పాలి. సుకుమార్ ని నమ్మే ‘ఉప్పెన’ లాంటి ప్రాజెక్ట్ ను బుచ్చిబాబు చేతిలో పెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ కి ఓ దారి దొరికింది. అయితే ఇప్పుడు కూడా శిష్యుడికి అండగా నిలుస్తున్నారు సుకుమార్. తన తదుపరి సినిమా ఎవరితో చేయాలనే విషయంలో బుచ్చిబాబులో కన్ఫ్యూజన్ మొదలైంది. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు. ఆయనకు కథ కూడా వినిపించారు.

కానీ ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పారు బుచ్చిబాబు. ఈ మీటింగ్ కూడా సెట్ చేసింది సుకుమారే. అయితే ‘పుష్ప’ లాంటి సినిమా చేసిన తరువాత ఎలాంటి కథ చేస్తే బాగుంటుందనే విషయంలో బన్నీ ఆలోచనలో పడ్డారు. బన్నీకి నచ్చజెప్పి తన శిష్యుడితో సినిమా ఓకే చేయించాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ బన్నీ కాదంటే మరో హీరోతో ఆ కథను సెట్ చేసే విధంగా పావులు కదుపుతున్నారు. మొత్తానికి సుకుమార్ తన శిష్యుడికి భరోసా ఇస్తూ మరోసారి సినిమాను సెట్ చేసే బాధ్యత తన భుజాలపై వేసుకున్నారు.