ప్ర‌భాస్-ప్ర‌శాంత్.. ఒక మైథ‌లాజిక‌ల్ మూవీ

కేజీఎఫ్ మూవీతో దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా మారిపోయాడు ప్ర‌శాంత్ నీల్. అత‌డితో ప‌ని చేయ‌డానికి వివిధ ఇండస్ట్రీల‌కు చెందిన టాప్ స్టార్లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఐతే అత‌ను టాలీవుడ్ స్టార్ల‌కే ప్ర‌యారిటీ ఇచ్చాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌తో స‌లార్ అనే భారీ చిత్రం చేస్తున్న అత‌ను.. దాని త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ప్ర‌భాస్‌తో మ‌రో సినిమాకు కూడా ప్ర‌శాంత్ క‌మిట్మెంట్ ఇచ్చిన‌ట్లు ఇంత‌కుముందే వార్త‌లొచ్చాయి. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడ‌ని కూడా ప్ర‌చారం సాగింది. ఐతే ఇదేమీ గాలి వార్త కాద‌ని.. ప్ర‌భాస్ 25వ సినిమాగా తెర‌కెక్క‌బోయేది ఈ ప్రాజెక్టే అని ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా జాన‌ర్ గురించి కూడా ఒక క్రేజీ రూమ‌ర్ వినిపిస్తుండ‌టం విశేషం.

ప్ర‌భాస్-ప్ర‌శాంత్ క‌లిసి ఒక మైథ‌లాజిక‌ల్ మెగా మూవీ చేయ‌నున్నార‌ట‌. ఇది బాహుబ‌లిని మించిన భారీత‌నంతో తెర‌కెక్క‌నుంద‌ట‌. చాలా పెద్ద కాన్వాస్‌లో ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అతి పెద్ద సినిమాగా దీన్ని తీసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని.. ఈ సినిమా రేంజే వేరుగా ఉండ‌బోతోంద‌ని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నార‌ని.. అందుకే ఈ సినిమా ఆషామాషీగా ఉండ‌కూడ‌ద‌న్నది ఆయ‌న ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు. దీని గురించి ట్విట్ట‌ర్లో ఇప్పుడు పెద్ద చ‌ర్చ న‌డుస్తుండ‌టం.. #prabhas25 హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ‌వుతుండ‌టం విశేషం.

ఐతే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డానికి మాత్రం చాలా స‌మ‌య‌మే ప‌ట్టొచ్చు. ప్ర‌భాస్.. రాధేశ్యామ్‌తో పాటు స‌లార్, ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్ మూవీ పూర్తి చేయ‌డానికి ఇంకో రెండేళ్ల‌కు పైగానే స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆలోపు ప్రశాంత్ రెండు సినిమాలు చేయ‌డానికి వీలుంది.