అక్కడ థియేటర్లు తెరుచుకుంటున్నాయ్


గత నెల రోజుల ముందు నుంచి దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు మూతపడి ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొంచెం తగ్గింది కానీ.. ముప్పు అయితే తొలగిపోలేదు. సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్లా లాక్ డౌన్ అమలవుతుండగా.. వచ్చే నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఆగస్టుకో లేదంటే దసరాకో కానీ థియేటర్లు పున:ప్రారంభం కావని అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలున్నాయి.

కానీ ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో రాబోయే సోమవారం నుంచి థియేటర్లు పున:ప్రారంభం అవుతుండటం గమనార్హం. 50 శాతం ఆక్యుపెన్సీతో అక్కడ థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రనే ముందుంటోంది. కేసులు, మరణాల్లో ఆ రాష్ట్రానికి మరే స్టేట్ కూడా దరిదాపుల్లో లేదు. ఒక టైంలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింట్లో నమోదైన కేసులు, మరణాలతో సమానంగా మహారాష్ట్రలోనే కేసులు వచ్చాయి, మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అందరికంటే ముందు లాక్ డౌన్ పెట్టింది ఆ రాష్ట్రమే.

ఏడాది నుంచి అక్కడ థియేటర్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి. అవి తెరుచుకున్న సమయంలోనూ నామమాత్రంగా నడిచాయి. హిందీలో పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకుని మహారాష్ట్రలో థియేటర్లు ఒకప్పటిలా నడవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవడానికి అనుమతులివ్వడం ఆశ్చర్యకరమే. ఐతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎక్కువ దెబ్బ తిన్న మహారాష్ట్ర.. ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగింది. అక్కడ కేసులు, మరణాల సంఖ్య బాగా తగ్గిన నేపథ్యంలోనే లాక్ డౌన్ షరతులు సడలించి థియేటర్లకు అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది.