శాకుంతలం.. ఏం స్పీడు బాబోయ్

శైలి పరంగా ఒక ఛట్రంలో ఇమడని టాలీవుడ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకడు. ‘సొగసు చూడతరమా’ లాంటి క్లాస్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయం అయి.. ‘బాల రామాయణం’ లాంటి మైథలాజికల్ మూవీ తీసి.. ఆ తర్వాత చూడాలని ఉంది, ఒక్కడు లాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు తీసిన దర్శకుడతను. ఆ భారీ విజయాలకు తోడు మృగరాజు, సైనికుడు, నిప్పు లాంటి పెద్ద డిజాస్టర్లు కూడా గుణశేఖర్ తీసినవే. ఆపై ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాతో మెప్పించాడాయన.

ఇప్పుడు ఆయన్నుంచి ‘శాకుంతలం’ అనే మరో చరిత్రకు సంబంధించిన సినిమా రాబోతోంది. లాక్ డౌన్ రావడానికి కొన్ని నెలల ముందే ఈ సినిమాను ప్రకటించారు. షూటింగ్ మొదలు కానున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఎంతో భారీతనం ఉన్న సినిమా. పైగా భారీ సెట్టింగ్స్‌ మధ్య చిత్రీకరించాలి. ఈ నేపథ్యంలో సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందనే అంతా అనుకున్నారు.

కానీ అప్పుడే ‘శాకుంతలం’ చిత్రీకరణ 50 శాతం పూర్తయిపోయినట్లు గుణశేఖర్ వెల్లడించాడు. ప్రి ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడం.. షూటింగ్ ప్రణాళిక బద్ధంగా చేయడంతో భారీ సినిమా అయినప్పటికీ చాలా తక్కువ రోజుల్లో సగం చిత్రీకరణ పూర్తి చేయగలిగామని గుణశేఖర్ తెలిపాడు. సమంత సైతం వేగంగా షూటింగ్ జరగడానికి కారణమని.. భారీ సెట్లు వేసిన నేపథ్యంలో షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతగా నాకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతో తను అన్ని రకాలుగా సహకరించిందని చెప్పాడు గుణ.

మే 10 వరకు షూటింగ్ జరిపామని.. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ ఆగిందని.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సెట్టింగ్స్ పనులు మొదలుపెట్టామని.. లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేస్తామని గుణ తెలిపాడు. ‘రుద్రమదేవి’ టైంలో తాను పడ్డ ఆర్థిక ఇబ్బందులను చూసిన దిల్ రాజు.. ఆర్థికపరమైన టెన్షన్ లేకుంటే సినిమా ఇంకా బాగా తీస్తానన్న ఉద్దేశంతో ‘శాకుంతలం’లో భాగస్వామి అయ్యాడని.. ఆయన ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని గుణ చెప్పాడు.