హిట్టు కొట్టాడు.. ఛాన్స్ పట్టాడు


ఏక్ మిని కథ.. ఈ మధ్యే అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటున్న చిత్రం. కాన్సెప్ట్ బోల్డ్ అయినప్పటికీ వల్గారిటీ లేకుండా నీట్‌గా ఈ సినిమా తీయడం.. మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారీ చిత్రాన్ని. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్టుతో కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ నిర్మించడం విశేషం.

హీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగులవుతున్న దివంగత దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్‌కు ‘ఏక్ మిని కథ’ గొప్ప ఉపశమనాన్నే ఇచ్చింది. హీరోగా అతడికిదే తొలి విజయం. థియేటర్లలో రిలీజ్ కాకపోయినప్పటికీ.. సంతోష్‌కు రావాల్సిన గుర్తింపు బాగానే వచ్చింది. ప్రేక్షకుల్లో అతడిపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు ఈ కుర్రాడు బాగా సరిపోతాడనే అభిప్రాయం కలిగింది.

‘ఏక్ మిని కథ’ చేస్తున్న సమయంలోనే సంతోష్‌తో యువి వాళ్లు ఇంకో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకోవడం విశేషం. కాబట్టి అతడి కెరీర్‌కు ఢోకా లేనట్లే అనుకోవాలి. కాగా ఇప్పుడు బయట కూడా అతనో సినిమాను దక్కించుకున్నాడు. అది కూడా వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో కావడం విశేషం. నందిని రెడ్డి లాంటి పేరున్న దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందించనుందట.

‘ఓ బేబీ’తో పెద్ద హిట్టు కొట్టిన నందిని.. ఆ తర్వాత ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించలేదు. వైజయంతీ బేనర్లో సినిమా ఓకే అయిందే తప్ప.. హీరో ఎవరో తేలలేదు. సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. ఐతే ఇప్పుడు సంతోష్‌ను ఈ చిత్రానికి కథానాయకుడిగా ఖరారు చేశారట. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గి మళ్లీ షూటింగ్స్ మొదలయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారట. ఓవైపు యువిలో, ఇంకో వైపు వైజయంతీలో సినిమాలు చేయడమంటే చిన్న విషయం కాదు. సంతోష్ కెరీర్ ఇక సెట్టయిపోయినట్లే.