దృశ్యం-2.. ప్లాన్ మారిపోయిందా?


టాలీవుడ్ సీనియర్ హీరోల్లో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే వాళ్లలో విక్టరీ వెంకటేష్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆయన కొన్ని నెలల్లోనే సినిమాలు అవగొట్టేస్తుంటారు. తరచుగా రీమేక్స్ చేయడం వల్ల కూడా ఈ స్పీడు చూపించగలుగుతుంటారు వెంకీ. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్‌ను నెలన్నర రోజుల్లో ముగించేసిన సంగతి తెలిసిందే. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి.

ఐతే దీని కంటే ముందు ‘నారప్ప’ పూర్తయిన నేపథ్యంలో ముందు దాన్ని రిలీజ్ చేసి, ఆ తర్వాత ‘దృశ్యం-2’ సంగతి చూడాలని నిర్మాత సురేష్ బాబు అనుకున్నాడు. మధ్యలో ‘దృశ్యం-2’ ఓటీటీలో వస్తుందన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఐతే థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఆలోచన మార్చుకుని ఓటీటీల్లో విడుదల చేసిన సినిమాలు లేకపోలేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ.

‘దృశ్యం-2’ విషయంలోనూ ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఆగస్టుకు కానీ తెరుచుకునే అవకాశం లేకపోవడం, పైగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా సమయం పట్టేలా ఉండటం, ‘నారప్ప’ను రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి ‘దృశ్యం-2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసరికి చాలా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు రెడీ అయిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు కూడా జరిపారని, డీల్ కూడా ఓకే అయిందని.. త్వరలోనే దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. కుదిరితే జూన్‌లోనే ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో రిలీజ్ చేయొచ్చని అంటున్నారు.

మలయాళ ‘దృశ్యం-2’ను ఫిబ్రవరిలో నేరుగా ప్రైమ్‌ వాళ్లే రిలీజ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు అదే ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజైతే ఒకే సినిమా రెండు భాషల్లో ఒకే చోట అందుబాటులో ఉంటుందన్నమాట.