తుఫాన్ దెబ్బ‌కు ఆ నిర్మాతకు 30 కోట్ల న‌ష్టం


క‌రోనా క‌ష్టాలు చాల‌వ‌ని ఇండియాను కొన్ని రోజులుగా తౌక్టే తుఫాను ఎలా వ‌ణికించేస్తోందో.. దాని వ‌ల్ల‌ ఎంత న‌ష్టం వాటిల్లుతోందో తెలిసిందే. ముంబ‌యి స‌హా కొన్ని న‌గ‌రాలు తుఫాను ధాటికి వ‌ణికిపోయాయి. భారీ వ‌ర్షాలు ఎన్నోసార్లు ముంబ‌యి న‌గ‌రాన్ని ముంచెత్త‌డం చూశాం. అప్ప‌టికంటే ఎక్కువ‌గా తౌక్టే తుపాను న‌గ‌రాన్ని దెబ్బ తీసింది.

తాజ్ హోట‌ల్ ముందు స‌ముద్ర‌పు నీరు రోడ్ల మీదికి వ‌చ్చి అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు త‌లెత్తిన వీడియోను సోష‌ల్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. అది చూశాక న‌గ‌రం ఎంత‌గా దెబ్బ తిని ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. అస‌లే క‌రోనా ధాటికి దారుణంగా న‌ష్ట‌పోయిన బాలీవుడ్‌ను ఈ తుపాను కూడా గ‌ట్టి దెబ్బే తీసింది. బాలీవుడ్‌కు కేంద్ర‌మైన ముంబ‌యిలో సినిమా స్టూడియోలపై తుపాను బాగా ప్ర‌భావం చూపింది. అనేక సెట్టింగ్స్ దెబ్బ తిన్నాయి. వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది.


కేవ‌లం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కార‌ణంగా రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఫుట్ బాల్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా కోసం ముంబ‌యిలో భారీ సెట్టింగ్స్ నిర్మించారు. క‌రోనా నేప‌థ్యంలో పూర్తిగా ఈ సెట్టింగ్స్‌లోనే సినిమా తీయ‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే ఆ సెట్టింగ్స్ అన్నీ తుపాను కార‌ణంగా పూర్తిగా దెబ్బ తిన‌డంతో రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత బోనీక‌పూర్ స్వ‌యంగా మీడియాకు తెలిపాడు.

ఇక హైద‌రాబాద్‌లోనూ కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌గా.. ఆ ధాటికి నాని చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ చిత్ర నిర్మాత‌కు ఆరున్న‌ర కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భారీ ఖ‌ర్చుతో వేసిన‌ కోల్‌క‌తా సెట్ పూర్తిగా దెబ్బ తింద‌ట‌. ఇక్క‌డ ప‌ది రోజుల షూటింగ్ మాత్ర‌మే చేశారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగింది. మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక షూటింగ్ అనుకున్నారు కానీ.. ఈలోపు వ‌ర్షాల వ‌ల్ల ఆ సెట్ దెబ్బ తిని, మ‌ళ్లీ కొత్త‌గా వేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ట‌.