చిరు ది గ్రేట్.. జిల్లాకో ఆక్సిజన్ ప్లాంట్

Chiranjeevi
Chiranjeevi

కొవిడ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది లాక్ డౌన్ ధాటికి సినీ పరిశ్రమ షట్ డౌన్ అయితే కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించి సహాయ నిధిని ఆరంభించాడు మెగాస్టార్. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది సెలబ్రెటీలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. ఆ నిధితో నెలల పాటు సినీ కార్మికులు నిత్యావసరాలు అందిస్తూ వచ్చింది చిరు నేతృత్వంలోని కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ.

ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి చిరు టీం అదే రీతిలో సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. కొవిడ్ టైంలో హైదరాబాద్‌లో రక్త కొరత ఏర్పడకుండా చూడటంలో చిరు బ్లడ్ బ్యాంక్‌ది కీలక పాత్ర. అలాగే కరోనా చికిత్సలో ప్లాస్మా కీలకంగా ఉన్నపుడు పోలీసులతో కలిసి ప్లాస్మా డొనేషన్ మీద జనాల్లో అవగాహన పెంచి కొవిడ్ విజేతలను అటు వైపు నడిపించడంలోనూ చిరు కీలకంగా ఉన్నాడు.


ఇక ఇండస్ట్రీలో ఎవరు కష్టాల్లో ఉన్నా వెంటనే తన వంతుగా విరాళాలు ప్రకటిస్తూ చిరు తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. టీఎన్ఆర్, పావలా శ్యామల లాంటి వాళ్లకు ఆయన సాయం అందించడం తెలిసిందే. ఇప్పుడు చిరు ఒక గొప్ప పనికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు సరిపడా లేక కొవిడ్ బాధితులు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. ఈ కారణంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తకుండా ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా తమ ప్రయత్నం తాము చేస్తుండగా.. చిరు తన బాధ్యతగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు. ఇందుకు కోట్లల్లోనే ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఈ పని చేపడితే బ్లడ్ బ్యాంకు తర్వాత చిరు సొసైటీకి చేస్తున్న అది పెద్ద సేవా కార్యక్రమంగా ప్రశంసలందుకోవడం ఖాయం.