రాజశేఖర్-గోపీచంద్ మల్టీస్టారర్?

టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆ మల్టీస్టారర్లో నటించేది సీనియర్ హీరో రాజశేఖర్.. ఆయన తర్వాతి తరం కథానాయకుడు గోపీచంద్ అట. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం లాంటి మాస్ ఎంటర్టైనర్లు తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.

‘లక్ష్యం’తో తనపై బాగా అంచనాలు పెంచేసిన శ్రీవాస్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. మధ్యలో ‘లౌక్యం’తో ఓకే అనిపించాడు కానీ.. మిగతా సినిమాలు నిరాశ పరిచాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సాక్ష్యం’ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడు.

ఈ సినిమా వచ్చాక దాదాపు మూడేళ్ల నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. గోపీచంద్‌తోనే ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇంకో సినిమా కూడా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది.

ఐతే ఎట్టకేలకు ఓ కథను ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించి మల్టీస్టారర్ చేయడానికి శ్రీవాస్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకుని వరుసగా సినిమాలు చేస్తున్న రాజశేఖర్.. మళ్లీ మంచి హిట్టు కోసం చూస్తున్న గోపీచంద్‌లతో అతను మల్టీస్టారర్ చేయనున్నాడట. ఈ ఇద్దరు హీరోలూ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.

ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ‘శేఖర్’తో పాటు మరో రెండు థ్రిల్లర్ సినిమాలను స్వల్ప వ్యవధిలో అనౌన్స్ చేయడం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన మల్టీస్టారర్ చేయనున్నాడట. గోపీచంద్ విషయానికి వస్తే ‘సీటీమార్’ను పూర్తి చేసి ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడతను.