అంచనాలు ఇంకా పెంచేసిన ఎన్టీఆర్


‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. జక్కన్న సినిమా అంటేనే యాక్షన్ ఘట్టాలు మామూలుగా ఉండవు. ‘బాహుబలి’తో తనకు తానే గొప్ప ప్రమాణాలు నిర్దేశించుకున్నాడాయన. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద మాస్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా.. అజయ్ దేవగణ్ లాంటి నేషనల్ మాస్ స్టార్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు మామూలుగా ఉండవు అనే అంచనాలు ముందు నుంచి ఉన్నాయి.

చరణ్, తారక్‌ల పాత్రల ఇంట్రో వీడియోలు చూస్తేనే గూస్ బంప్స్ మూమెంట్స్ కనిపించాయి. ఇటీవలే రిలీజ్ చేసిన అజయ్ దేవగణ్ క్యారెక్టర్ మోషన్ పోస్టర్ సైతం యాక్షన్ ప్రియుల్లో అంచనాలు పెంచింది. ‘ఆర్ఆర్ఆర్’ కథ కంటే కూడా అందులోని యాక్షన్ ఘట్టాల గురించి ముందు నుంచి చర్చ జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్ ఇచ్చినపుడల్లా కూడా యాక్షన్ సన్నివేశాల ప్రస్తావనే ఉంటోంది.

‘ఆర్ఆర్ఆర్’లో ప్రతి యాక్షన్ బ్లాక్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని.. ఇక ద్వితీయార్ధం అయితే యాక్షన్ ప్రియులకు కనువిందే అని.. పతాక ఘట్టం అయితే మామూలుగా ఉండదని చెబుతూ వస్తున్నాయి చిత్ర వర్గాలు. దీంతో వీటిపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. ఆ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్. “ఆర్ఆర్ఆర్‌లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విస్మయపరిచేలా ఉంటాయి. ఇందులోని ప్రతి యాక్షన్ ఘట్టం కూడా ప్రేక్షకులతో ‘వావ్’ అనిపించేలా డిజైన్ చేయబడింది. యాక్షన్ సన్నివేశాలపుడు ఆడియన్స్ తమ కుర్చీల్లో కుదురుగా కూర్చోలేరు. ఇంతకుమించి నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే రాజమౌళి ఊరుకోడు” అని ఆ ఇంటర్వ్యూలో తారక్ పేర్కొన్నాడు.

తారక్ నోటి నుంచి ఈ మాటలు వచ్చాక ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ ఘట్టాలు ఏ స్థాయిలో ఉంటాయో అనే ఎగ్జైట్మెంట్ ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. ఈ సినిమాకు తాను పడ్డ శారీరక శ్రమ అసాధారణమైందని.. ఒక దశలో 71 కిలోల బరువున్న తాను 9 కిలోలు పెరగడమే కాక శరీరాకృతిని మార్చుకున్నట్లు తారక్ చెప్పాడు.