అనిల్ ప్లాన్‌కు త్రివిక్రమ్ బ్రేక్


సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య ఆల్రెడీ పని చేసిన దర్శకులనే రిపీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ చేశాక తక్కువ విరామంలో మళ్లీ అదే దర్శకుడితో ‘భరత్ అనే నేను’ చేశాడు. ‘మహర్షి’ తీసిన వంశీ పైడిపల్లితో కూడా వెంటనే ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కానీ.. మహేష్ మెచ్చే కథను వంశీ సిద్ధం చేయలేకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్‌తోనూ మరో సినిమాకు మహేష్ కమిట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ‘సర్కారు వారి పాట’ తర్వాత అనిల్‌తోనే మహేష్ సినిమా చేయాల్సింది. దీనికి అనిల్ కథ కూడా రెడీ చేసేశాడట. ఐతే ఈలోపు అనుకోకుండా త్రివిక్రమ్‌తో సినిమాను ముందుకు తెచ్చాడు మహేష్. ‘ఎఫ్-3’ తర్వాత తాను మహేష్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉండగా.. అనుకోకుండా త్రివిక్రమ్ సినిమా రావడంతో అది ఆలస్యం అవుతోందని ఓపెన్‌గానే చెప్పేశాడు అనిల్.

త్రివిక్రమ్‌తో మహేష్ సినిమా అవ్వగానే ఆయనతో తన సినిమా మొదలవుతుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. బహుశా అనిల్ కెరీర్ ఆరంభం నుంచి అతడితో జర్నీ చేస్తున్న దిల్ రాజే ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ గురించి అనిల్ చెబుతూ.. ఏప్రిల్ 15న మైసూర్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సిందని.. కానీ 14న తనకు కరోనా రావడంతో ఆ ప్లాన్ మొత్తం మారిపోయిందని చెప్పాడు. ఇప్పటికి 50 శాతానికి పైగానే సినిమా పూర్తయిందని.. మైసూర్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 80 శాతం షూటింగ్ అయిపోయేదని అన్నాడు. తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పుడు కొత్తగా షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నట్లు అనిల్ వెల్లడించాడు.

తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. దేవుడి దయ వల్ల అందరూ కోలుకున్నారని అనిల్ వెల్లడించాడు. ‘ఎఫ్-3’ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చెన్నైలోని ఒక హోటల్‌కు వెళ్లానని.. బహుశా అక్కడే తనకు కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నట్లు అనిల్ తెలిపాడు. ఇదిలా ఉండగా బాలకృష్ణ కోసం కూడా తాను ఓ స్క్రిప్టు రెడీ చేశానని, అదొక కొత్త జానర్లో ఉంటుందని అనిల్ వెల్లడించాడు.