ఆ తప్పు ఎప్పటికీ చేయననేసిన ఛార్మి


హీరోయిన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ ప్రేమ-పెళ్లి గురించి చర్చ ఇప్పటిది కాదు. ఆమె కథానాయికగా చాలా బిజీగా ఉన్న టైంలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో ప్రేమలో ఉందని.. అతణ్ని పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఐతే కొన్నేళ్ల తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత కథానాయికగా ఛార్మి ప్రభ తగ్గడం మొదలయ్యాక ఛార్మి పెళ్లి గురించి కొన్ని సార్లు చర్చ వచ్చింది. కానీ ఆమె పూరి జగన్నాథ్ క్యాంపులో చేరిపోయి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. కొన్నేళ్లుగా ఆయనతో కలిసి సాగుతోంది. సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం కూడా ఆమె ‘లైగర్’ సినిమా పనిలో బిజీగా ఉంది.

ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఛార్మి పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె పెళ్లి వైపు అడుగులు వేయబోతున్నట్లుగా మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై ఛార్మి తనదైన శైలిలో స్పందించింది.

తన పెళ్లి వార్తలపై ఛార్మి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అందులో.. ‘‘నేనిప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నా. నా జీవితం పట్ల చాలా సంతోషంగానూ ఉన్నాను. కాబట్టి పెళ్లి అనే తప్పును నా జీవితంలో ఎప్పటికీ చేయను’’ అనేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఓకే కానీ.. ఎప్పటికీ పెళ్లి చేసుకునేదే లేదు అని ఛార్మి ఖరాఖండిగా చెప్పేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది పూరి జగన్నాథ్ ప్రభావంతో తీసుకున్న నిర్ణయమా అన్న చర్చ నడుస్తోంది జనాల్లో.

పూరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు కానీ.. పెళ్లి విషయంలో ఆయనంత సానుకూల వ్యాఖ్యలు చేయడు. పాడ్ కాస్ట్‌ల్లో కూడా పెళ్లి గురించి కొంత ప్రతికూల వ్యాఖ్యలే చేశాడు. ఇక పూరి గురువు రామ్ గోపాల్ వర్మ సంగతి తెలిసిందే. పెళ్లి గురించి పూర్తి నెగెటివ్‌గా మాట్లాడతాడు. ఛార్మి మీద వీరి ప్రభావం బాగానే పడిందని.. అందుకే పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.