జాతిరత్నాలు-2.. మాట వరసకి కాదు


కరోనా విరామం తర్వాత తెలుగులో థియేటర్లలో రిలీజైన చిత్రాల్లో అతి పెద్ద విజయం సాధించిన వాటిలో ‘జాతిరత్నాలు’ ఒకటి. మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించింది. పోటీలో ఉన్న సినిమాలన్నింటినీ తొక్కి పడేసి వసూళ్ల వర్షం కురిపించింది. పేరుకు చిన్న సినిమా కానీ.. దాని వసూళ్లు చూస్తే మాత్రం పెద్ద సినిమాగానే పరిగణించాలి.

ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ల సమయంలో సీక్వెల్ గురించి చర్చ జరిగింది. ఒక వేదిక మీద స్వయంగా దర్శకుడు అనుదీప్ ‘జాతిరత్నాలు-2’ ఉంటుందని ప్రకటించాడు. ఐతే సినిమా రిలీజైన కొత్తలో ప్రమోషన్ల కోసమని సీక్వెల్ ముచ్చట్లు చెప్పడం.. ఆ తర్వాత పక్కన పెట్టేయడం మామూలే. పైగా పెద్దగా కథంటూ లేని ‘జాతిరత్నాలు’ సినిమాను మళ్లీ సాగదీయడానికి ఏముంది అనే సందేహం కూడా లేకపోలేదు.

కానీ దర్శకుడు అనుదీప్, నిర్మాత నాగ్ అశ్విన్ మాత్రం ‘జాతిరత్నాలు-2’ విషయంలో చాలా సీరియస్‌గానే ఉన్నారని సమాచారం. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే సీక్వెల్ పనిలో పడిపోయారట. తనకు పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘స్వప్న సినిమా’కే తర్వాతి సినిమా కూడా చేయడానికి అనుదీప్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కమిట్మెంట్లో భాగంగా ‘జాతిరత్నాలు-2’ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడుస్తోందట.

ఐతే ‘జాతిరత్నాలు’ తరహా మ్యాజిక్స్ అన్నిసార్లూ వర్కవుట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. అలాంటి కామెడీ అన్నిసార్లూ పని చేయదు. మరోసారి అలాంటి సిల్లీ స్టోరీతోనే బండి నడిపిస్తాం అంటే కుదరకపోవచ్చు. ఈసారి కథ కొంచెం లాజికల్‌గా, బలంగా ఉండేలా చూసుకుంటే బెటర్. అలాగని ఫన్ విషయంలో ఢోకా లేకుండా చూసుకోవాలి. మరి ఈ ఛాలెంజ్‌ను అనుదీప్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.