కరోనాను తన్ని తరిమేసిన హీరోయిన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అంటే హీరోయిన్ పూజా హెగ్డేకు అస్సలు లెక్క లేనట్లుంది. అదంటే ఏమాత్రం భయం భక్తీ లేకుండా కామెంట్లు చేస్తోందామె. రెండు వారాల కిందట కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేక ఐసొలేట్ అయిన పూజా.. ఇప్పుడు వైరస్ నుంచి కోలుకుందట. తనకు నెగెటివ్ కూడా వచ్చేసిందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కరోనా గురించి కామెడీ చేస్తూ కామెంట్ పెట్టింది.

స్టుపిడ్ కరోనాను ముడ్డి మీద తన్ని తరిమేశా అంటూ ఆమె వ్యాఖ్యానించడం విశేషం. కరోనా నుంచి కోలుకున్న ఫొటోను కూడా షేర్ చేసిన పూజా.. తన కోసం అభిమానులు ఇచ్చిన ప్రేమ ద్వారా వచ్చిన శక్తే మ్యాజిక్ చేసిందని.. కాబట్టే త్వరగా కోలుకున్నానని పూజా వ్యాఖ్యానించింది. కరోనా కష్ట కాలంలో అందరూ ఇంటిపట్టునే ఉండాలని ఆమె అభిలషించింది.

పూజా కరోనా బారిన పడ్డ కొన్ని రోజులకే అల్లు అర్జున్ సైతం కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీనిపై పూజా స్పందిస్తూ.. అమూల్య (అల వైకుంఠపురములో తను పోషించిన పాత్ర పేరు)కు తోడుగా నిలవడానికి బంటూ (ఆ సినిమాలో బన్నీ పేరు) వచ్చాడంటూ తనదైన శైలిలో చమత్కరించింది. ఇప్పుడు పూజా నెగెటివ్‌గా తేలినట్లు వార్త పంచుకోగానే ఇంతకీ నీ కోసం కంపెనీ ఇచ్చిన బంటూ సంగతేంటి అని అభిమానులు అడుగుతుండటం విశేషం.

బహుశా బన్నీ కూడా తాను కోలుకుంటున్నట్లు ఇటీవలే అప్‌డేట్ ఇచ్చిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ‘నెగెటివ్’ వార్తతో అభిమానుల ముందుకు రావచ్చు. పూజా ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’‌లతో పాటు తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాతో బిజీగా ఉంది. ఆమె చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.