అదేంటో ఆర్‌. నారాయణ మూర్తే గుర్తొస్తారు

‘మే డే’..అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అనేక దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’ కావటంతో అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఇదొక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించిన రోజు. కార్మికులు త‌మ హ‌క్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు . తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తిన రోజు. ఈ రోజుని తలుచుకోగానే తెలుగువారికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి గుర్తు వస్తారు.

సమాజ గతిని, పురోగతిని శాసించి, నిర్ధేశించే శ్రామిక వర్గం తరుపున వకల్తా పుచ్చుకున్నట్లు ఉంటాయి ఆయన సినిమాలు. ఆయన దర్శకత్వంలో శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు ఆర్‌ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన సినిమాల్లో పాటలు కూడా కార్మికుల,కర్షకుల కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. అందుకే మేడే సందర్భంగా తెలుగు టీవి ఛానెల్స్ లో పోగ్రామ్ లు వేస్తే ఖచ్చితంగా ఆర్ .నారాయణ మూర్తి పాటలు, డైలాగులు ఉండి తీరతాయి.

ఆర్.నారాయణ మూర్తి గత కొంతకాలంగా సినిమాల జోరు తగ్గించారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిసింది. సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనా చిత్ర పరిశ్రమంపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు.