హరిహర వీరమల్లు.. ప్లాన్ మారలేదు

గత ఏడాది వేసవికి అనుకున్న పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి విడుదలైంది. ఆయన చేస్తున్న వేరే సినిమాల షెడ్యూళ్ల మీదా కరోనా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల ముందే వైరస్ కథ ముగిసిందని.. ఇక మళ్లీ దాని బెడద లేదని అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ ఈ మహమ్మారి విజృంభిస్తూ సినిమాలు సహా అన్ని రంగాల మీదా ప్రభావం చూపిస్తోంది. పవన్ చేస్తున్న రెండు సినిమాల షూటింగ్‌లూ ఆగిపోయాయి.

స్వయంగా పవర్ స్టారే కరోనా బారిన పడటంతో ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు పున:ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ముందు అనుకున్నట్లు అయ్యప్పనుం కోషీయుం రీమేక్ సెప్టెంబరులో, హరిహర వీరమల్లు 2022 సంక్రాంతికి విడుదల అవుతాయా కావా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే అయ్యప్పనుం కోషీయుం రీమేక్ సంగతేమో కానీ.. ‘హరి హర వీరమల్లు’ మాత్రం సంక్రాంతికి వస్తుందనే ధీమాతోనే ఉన్నాడు నిర్మాత ఎ.ఎం.రత్నం.

పవన్‌తో రత్నం నిర్మించిన మెగా బ్లాక్‌బస్టర్ ‘ఖుషి’ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రత్నం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ చిత్ర షూటింగ్ ఆపేశామని.. మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ పున:ప్రారంభం అవుతుందో స్పష్టత లేదని.. అయినప్పటకీ ‘హరి హర..’ను 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనే ధీమాతోనే ఉన్నట్లు రత్నం తెలిపాడు.

ఇంకా తమకు చాలా సమయం ఉందని.. కాబట్టి డెడ్ లైన్ అందుకుంటామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు. క్రిష్ ఎంత భారీ చిత్రం తీసినా మేకింగ్ చాలా స్పీడుగా ఉంటుంది. ఇంతకుముందు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను 70 రోజుల్లోపు పూర్తి చేసి ఔరా అనిపించాడు. అదే స్పీడును పవన్ సినిమా విషయంలోనూ చూపిస్తే వచ్చే సంక్రాంతికి పవర్ స్టార్ అభిమానులకు ట్రీట్ సిద్ధం కాబోతున్నట్లే.