పవర్ స్టార్ పవన్ అభిమానుల భయం తొలగినట్లే. కరోనా వైరస్ బారిన పడ్డ జనసేనాని కోలుకున్నట్లు సమాచారం. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఇవ్వబోతున్నట్లు సమాచారం. పవన్కు కరోనా అని కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. ఐతే బయటికి ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందే పవన్ కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్కు హాజరైన సమయంలోనే పవన్ కరోనా బారిన పడి ఉండొచ్చని తెలుస్తోంది. ఆ వేడుకలో పాల్గొన్న దిల్ రాజు సైతం పాజిటివ్గా తేలడం, వారం రోజుల్లోనే ఆయన కోలుకోవడం, ఆయనకూ నెగెటివ్ రావడం తెలిసిందే.
ఇప్పుడు పవన్ సైతం త్వరగానే కోలుకున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్తో ‘అయ్యప్పనుం కోషీయుం’ షూటింగ్ సందర్బంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న సాగర్ చంద్ర ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. పవన్తో దగ్గరగా మెలిగిన చాలామంది క్వారంటైన్లోకి వెళ్లారు. పవన్ హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని త్వరగా కోలుకున్నారు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాక పవన్ షూటింగ్కు వెళ్లే అవకాశముంది.
ప్రస్తుతం కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టాలీవుడ్లో వరుసగా సినిమా షూటింగ్లకు బ్రేకులు పడుతున్నాయి. పవన్ కూడా ఈ విషయంలో తొందరపడాలని అనుకోవట్లేదు. ఈ నెల అంతా ఆయన షూటింగ్స్కు వెళ్లే అవకాశం లేదు. ఎలాగూ ఎండలు కూడా మండిపోతుండటంతో ఫాం హౌస్లోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates