నారప్ప తప్పుకుంటే.. దృశ్యం-2

టాలీవుడ్ స్టార్ హీరోల్లో రీమేక్ చిత్రాలతో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న హీరో విక్టరీ వెంకటేష్. గత కొన్నేళ్లలో ఆయన ‘దృశ్యం-2’; ‘గురు’ లాంటి రీమేక్‌లతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వెంకీ చేతిలో ఉన్న నారప్ప, దృశ్యం-2 కూడా రీమేక్ చిత్రాలే అన్న సంగతి తెలిసిందే. ఇందులో ‘నారప్ప’ తమిళ హిట్ ‘అసురన్’ ఆధారంగా తెరకెక్కగా.. ‘దృశ్యం-2’ అదే పేరుతో తెరకెక్కిన మలయాళ మూవీకి రీమేక్. ‘నారప్ప’ ఎప్పుడో ఏడాదిన్నర కిందటే మొదలు కాగా.. కరోనా వల్ల ఆలస్యం అయింది. ‘దృశ్యం-2’ మలయాళంలో రెండు నెలల కిందట రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్‌కు సన్నాహాలు జరిగాయి. చకచకా సినిమాను అవగొట్టేశారు. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. ఇంకొన్ని వారాల్లోనే సినిమా ఫస్ట్ కాపీతో రెడీ అయిపోతుందని అంటున్నారు. కాగా ఏడాదిన్నర కిందట మొదలైన ‘నారప్ప’ కంటే ‘దృశ్యం-2’ ముందు రిలీజైతే ఆశ్చర్యం లేదన్నది తాజా సమాచారం.

‘నారప్ప’ను ముందు అనుకున్న ప్రకారం అయితే మే 14న రిలీజ్ చేయాలి. కానీ ‘ఆచార్య’తో పోటీ రావడంతో దాని డేట్ మార్చాలని భావించారు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ సినిమాలను మళ్లీ దెబ్బ కొట్టడం మొదలైంది. వరుసగా ఈ నెలలో రావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రభావానికి తోడు ఏపీలో టికెట్ల గొడవ ఒకటి తయారైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు మారితే తప్ప పేరున్న కొత్త సినిమాలు రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పరిస్థితులు మారే వరకు ఎదురు చూసి కొత్త సినిమాల రిలీజ్ సంగతి తేల్చనున్నారు. పరిశ్రమలో నార్మల్సీ వచ్చాక ఈ నెల నుంచి వాయిదా పడ్డ సినిమాలను ముందు షెడ్యూల్ చేయాలి. ఆ తర్వాతే మే సినిమాల సంగతి తేలుతుంది.

చూస్తుంటే వచ్చే రెండు నెలల్లో ‘నారప్ప’ రావడం సందేహంగానే ఉంది. అది అయ్యాకే ‘దృశ్యం-2’ రిలీజ్ చేద్దామనుకుంటే.. దీని మలయాళ వెర్షన్ అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేసేకొద్దీ ఇబ్బందే. ‘అసురన్’ సైతం అమేజాన్‌లో ఉంది కానీ.. ఇప్పుడు ఆ సినిమా వేడి ఏమీ లేదు. అందుకే ‘నారప్ప’ కంటే ముందు ‘దృశ్యం-2’ను రిలీజ్ చేసే యోచన నిర్మాత సురేష్ బాబు చేస్తున్నారట. రెండు చిత్రాలకూ ఆయనే నిర్మాత కాబట్టి ఏ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది ఆయనిష్టం. థియేటర్లలో మామూలు పరిస్థితులు ఇప్పుడే రావనుకుంటే ‘దృశ్యం-2’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.