జాతిరత్నాలు చూసి తమిళ క్రికెటర్ ఫిదా


కరోనా విరామం తర్వాత తెలుగులో అతి పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి కామెడీ స్టార్లు నటించిన సినిమా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టడం అనూహ్యమే. చూడ్డానికి ఇది మామూలుగా సినిమానే. కథా కథనాల్లో పెద్దగా లాజిక్ ఉండదు. చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఐతేనేం ప్రేక్షకులకు ఆ సిల్లీనెస్‌లో ఉన్న ఫన్ బాగా నచ్చింది. సినిమా ఇరగాడేసింది. రెండు మూడు వారాల పాటు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది ‘జాతిరత్నాలు’. ఇప్పుడీ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయగా.. థియేటర్లలో చూడని వాళ్లందరూ ఓ లుక్కేస్తున్నారు.

ఐతే థియేటర్లలో రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి భారీ అంచనాలతో చూసిన కొందరు.. ఓటీటీలో సినిమా చూసి కొంత పెదవి విరుస్తున్న మాట వాస్తవమే. అదే సమయంలో ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ దానిపై ప్రశంసలు కురిపిస్తున్న వాళ్లూ ఉన్నారు.

‘జాతిరత్నాలు’ చూసి ఫిదా అయిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టడం విశేషం. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్. జాతిరత్నాలు సినిమా కడుపు చెక్కలయ్యేలా నవ్వించిందని.. ప్రతి సన్నివేశంలోనూ తాను నవ్వుతూనే ఉన్నానని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. డైలాగులు అదిరిపోయాయని.. డైరెక్షన్ అద్భుతమని.. నటీనటులు ప్రతి ఒక్కరూ బాగా చేశారని దినేశ్ కితాబిచ్చాడు. కామెడీ జానర్ అన్నింటికంటే కష్టమైందని.. కానీ దాన్ని ‘జాతిరత్నాలు’ అద్భుతంగా పండించిందని కార్తీక్ అన్నాడు. చివరగా ‘ఔట్ స్టాండింగ్’ అనే కామెంట్‌తో తన ట్వీట్ రివ్యూను ముగించాడు కార్తీక్.

డైలాగ్స్, నేటివిటీ మీద ఆధారపడ్డ ఓ తెలుగు సినిమా ఓ తమిళ క్రికెటర్‌కు మన సినిమా ఇంతగా నచ్చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐతే కార్తీక్‌కు తెలుగు బాగానే వచ్చన్నది సన్నిహితుల మాట. గత ఐపీఎల్ సీజన్లో ఓ మ్యాచ్ సందర్భంగా తెలుగు అంపైర్ సంషుద్దీన్‌తో తెలుగులోనే అతను మాట్లాడటం గమనార్హం.