పవన్ కెరీర్లో తొలిసారి అలా..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ మధ్యే మంచి ట్రీట్ అందింది. పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ వాళ్ల ఆకలిని బాగానే తీర్చింది. నిజానికి ఈ సినిమాపై అభిమానుల్లో మరీ అంచనాలేమీ లేవు. ఓ మోస్తరుగా ఉంటే చాలనుకున్నారు. ‘వకీల్ సాబ్’ ఆ స్థాయిలోనే ఎంటర్టైన్ చేసింది. పవన్ రీఎంట్రీకి రెడీ అయ్యాక అనౌన్స్ చేసిన చిత్రాల్లో అభిమానులను బాగా ఎగ్జైట్ చేసింది హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమానే.

ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. మళ్లీ ఆ కలయికలో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఎట్టకేలకు అది కార్యరూపం దాలుస్తుండటంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్టర్‌ సినిమాపై అంచనాలను బాగానే పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి బయటికొచ్చిన కొత్త కబురు పవన్ ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్నిస్తోంది.

హరీష్ శంకర్ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. పవన్ కెరీర్లో డబుల్ రోల్ ఇంత వరకు చేయలేదు. ఇదే తొలిసారి కాబోతోంది. పవన్ తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తాడట. అంతే కాక ఇందులో ఒకటి పోలీస్ క్యారెక్టర్ అట. ‘గబ్బర్ సింగ్’లో పోలీస్‌గా పవన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. పోలీస్ పాత్రల విషయానికొస్తే టాలీవుడ్ చరిత్రలోనే గబ్బర్ సింగ్‌కు ఒక ప్రత్యేక స్థానం దక్కింది. ఇప్పుడు మళ్లీ హరీష్ దర్శకత్వంలో పవన్ పోలీస్‌గా కనిపిస్తాడంటే అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. పవన్‌కు ఇది 29వ సినిమా అవుతుంది. ‘వకీల్ సాబ్’ ఆయనకు 26వ చిత్రం. ప్రస్తుతం ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ చిత్రాల్లో పవన్ సమాంతరంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.