చిరంజీవి మిత్ర ధర్మం

రాజకీయాలకు టాటా చెప్పేశాక మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకు అంకితం అయిపోయారు. పాలిటిక్స్‌లో ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కొంచెం దెబ్బ తినగా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఆ డ్యామేజ్‌కు రిపేర్లు చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు మెగాస్టార్. దాసరి మరణానంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో చిరు.. లాక్‌డౌన్‌ టైంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి చేయడంతో పాటు ఎన్నో మంచి పనులు చేశారు.

అలాగే ఇండస్ట్రీలో ఏ సినిమాకైనా సరే.. తన వంతు సాయం అవసరమైతే చేయడానికి చిరు ముందుకొచ్చారు. బిజీ షెడ్యూళ్లలో కూడా వేరే సినిమాల కోసం సమయం కేటాయించారు. ప్రమోషన్ పరంగా చాలామందికి చిరు సాయం చేశారు. ఇప్పుడు తన మిత్రుడైన నాగార్జున కోసం కూడా ఆయన చాలానే చేస్తున్నారు.

నాగ్ కెరీర్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో ఉంది. వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి. ‘వైల్డ్ డాగ్’కు ఆశించిన ప్రి రిలీజ్ బజ్ రాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. మంచి టాక్ వచ్చినా వసూళ్లు లేవు. ఈ నేపథ్యంలో చిరు స్వయంగా ఈ సినిమా చూసి దాని గురించి ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. అంతటితో ఆగకుండా చొరవ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.

విడుదల ముంగిట కూడా చిరు.. నాగ్‌ను తన ఇంటికి పిలిపించుకుని వంట చేసి పెట్టారు. సినిమాకు మరో రకంగా ప్రమోషన్ చేసి పెట్టారు. తాజాగా ప్రెస్ మీట్లో అయితే ‘వైల్డ్ డాగ్’ను ఆకాశానికెత్తేశారు చిరు. తన మిత్రుడి కోసం చిరు.. ఇంతగా తపించడం, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం గొప్ప విషయమే.

మామూలుగా పెద్ద హీరోలు తమ ఫ్యామిలీ హీరోల సినిమాలను ప్రమోట్ చేయడానికే చూస్తారు. మరెవ్వరూ కూడా తోటి హీరో కోసం ఇంతగా తపించరు. మిత్రధర్మం పాటించడంలో చిరు అందరికీ ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీ పెద్ద అనే మాటకు సరైన నిర్వచనం చెబుతున్నారు మెగాస్టార్.