#WakeUpMythriMovieMakers ట్రెండింగ్‌


తమ ఆరాధ్య కథానాయకుల సినిమాలు మేకింగ్ దశలో ఉండగా.. సమయానుకూలంగా అప్‌డేట్లు ఇవ్వకపోతే అభిమానులకు చిర్రెత్తుకొచ్చేస్తుంది. ఒక దశ వరకు వాళ్లు ఓపిక పడుతుంటారు కానీ.. ఆ తర్వాత అదుపు తప్పుతుంటారు. దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తుంటారు. సోషల్ మీడియా రూపంలో వారికి మంచి వేదిక కూడా ఉండటంతో రెచ్చిపోతుంటారు.

‘సాహో’, ‘రాధశ్యామ్’ సినిమాలకు అప్ డేట్స్ ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో యువి క్రియేషన్స్ బేనర్‌ను టార్గెట్ చేస్తూ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ బూతులు తిట్టడం.. ఒక దశలో యువి ఆఫీస్ దగ్గరికెళ్లి కూడా గొడవ చేయడం తెలిసిందే. ఈ మధ్య అజిత్ అభిమానులు ‘వాలిమై’ అప్ డేట్ కోసం ఆ సినిమా పీఆర్వోను టార్గెట్ చేశారు. నిర్మాత బోనీ కపూర్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ను ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారు.

#WakeUpMythriMovieMakers… ఇది మంగళవారం సాయంత్రం ఇండియా లెవెల్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్. దీన్ని ట్రెండ్ చేసింది అల్లు అర్జున్ అభిమానులే. ‘పుష్ప’ సినిమా ఆరంభమైనపుడు ఫస్ట్ లుక్ వదిలారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది మినహాయిస్తే ‘పుష్ప’ టీం నుంచి ఏ అప్‌డేట్ లేదు. దాదాపు సగం చిత్రీకరణ అయిందంటున్నారు. కానీ సినిమా నుంచి కొన్ని నెలలుగా ఏ విశేషం బయటికి రాలేదు.

ఆగస్టు 13న రిలీజ్ అంటే.. టీజర్ రిలీజ్‌ చేయాల్సిన సమయం దగ్గర పడిందని.. దాని గురించి అప్‌డేట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను డిమాండ్ చేస్తూ.. వాళ్లను నిద్ర లేవాలన్నట్లుగా హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ను మైత్రీ వాళ్లు సరదాగానే తీసుకున్నారు. ఆ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేస్తూ నవ్వుల ఎమోజీలు పెట్టారు. అభిమానుల డిమాండ్ చూశాక త్వరలోనే టీజర్ అప్‌డేట్ ఉంటుందని భావిస్తున్నారు.