దిల్ రాజు.. మరో మెగా కాంబినేషన్


టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయిలో తన ప్రొడక్షన్ హౌస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. ఆయన ఇప్పటికే బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నది దిల్ రాజే అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమాను కూడా ఆయన లైన్లో పెట్టాడు. శంకర్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుంది. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసే సినిమా కాబట్టి దాని స్థాయే వేరుగా ఉంటుంది.

మరోవైపు ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలయికలో ఒక పాన్ ఇండియా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. ఇప్పుడు రాజు నిర్మాణంలో మరో మెగా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.

ప్రశాంత్ నీల్‌‌ దర్శకత్వంలో ప్రభాస్ సినిమానే కాక మరో చిత్రం చేయడానికి కూడా దిల్ రాజు చూస్తున్నాడట. తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్ అనదగ్గ విజయ్‌తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలన్నది ఆయన ప్లాన్ అని తమిళ మీడియా రిపోర్ట్ చేసింది. ఈ మేరకు ఇరువురితో రాజు సంప్రదింపులు జరుపుతున్నాడని.. ఇద్దరూ సముఖత వ్యక్తం చేశారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంచెం సమయం పడుతుందని.. కానీ ఈ కాంబినేషన్లో రాజు సినిమా చేయడం మాత్రం గ్యారెంటీ అని అంటున్నారు.

ప్రస్తుతం ‘సలార్’ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఆపై బన్నీ, ప్రభాస్‌లకు కమిట్మెంట్లు ఇచ్చినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే విజయ్‌తోనూ పని చేయడానికి ఆసక్తిగా ఉన్న ప్రశాంత్‌ను ఆ తమిళ స్టార్‌తో రాజే కలిపాడని అంటున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.