ప‌వ‌న్ సునామీ చూడ‌బోతున్నామా?

వరుసగా ఫెయిల్యూర్లు వచ్చినా.. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసినా.. రీమేక్ సినిమా ట్రై చేసినా.. క్లాస్ కథ ఎంచుకున్నా.. ఇలా ఏం జరిగినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తోందంటే.. బాక్సాఫీస్ దగ్గర నెలకొనే హంగామానే వేరుగా ఉంటుంది. రిలీజ్ ముంగిట పవన్ సినిమాలకు ఉండే యుఫోరియానే వేరు. 90ల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎలాంటి హైప్ ఉండేదో దానికి దీటుగా బజ్ కనిపిస్తుంటుంది.

వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవి సైతం ఆ యుఫోరియాను మ్యాచ్ చేయలేడు అంటే అతిశయోక్తి కాదు. పవన్ సినిమా రిలీజవుతుంటే టికెట్ల కోసం ఉండే డిమాండే వేరు. ఏం చేసి అయినా, ఎంత పెట్టి అయినా టికెట్ సంపాదించి సినిమా చూడాలని అభిమానులు ఒక వెర్రితో ఉంటారు. ఈ క్రేజ్‌ను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు క్యాష్ చేసుకోవడానికి చూస్తుంటారు.

‘వకీల్ సాబ్’ విషయంలోనూ ఇదే జరగబోతోంది. మూడేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పవర్ స్టార్ అభిమానులు వెర్రెత్తిపోయి ఉన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తహతహలాడిపోతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రాలో గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్లీ మిడ్ నైట్ షోల హంగామా మొదలు కాబోతోంది. వెయ్యికి తక్కువ కాకుండా రేటుతో స్పెషల్ షో టికెట్లను అమ్మబోతున్నట్లు సమాచారం. రిలీజ్ టైంకి ఉండే హైప్‌ను బట్టి ఇంకా రేటు పెరిగినా ఆశ్చర్యం లేదు. తొలి వారం అంతా 5-6 షోలు వేసుకోవడానికి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు.

తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు కానీ.. అదనపు షోలకు అనుమతులు లాంఛనమే అంటున్నారు. దిల్ రాజు నిర్మాత కాబట్టి అది పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. అలాగే టికెట్ల రేట్లు కూడా పెరగబోతున్నాయి. చిన్న సినిమాలకే రేట్లు పెంచుతున్నపుడు పవన్ సినిమాకు పెంచకుండా ఎలా ఉంటారు. ఎలాగూ ‘పింక్’ రీమేకే కాబట్టి పాజిటివ్ టాక్ గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి వారం ప్యాక్డ్ హౌస్‌లతో సినిమా నడవడం గ్యారెంటీ. ముఖ్యంగా వీకెండ్లో పవన్ వసూళ్ల సునామీ చూడబోతుండటం, పాత రికార్డులన్నీ బద్దలైపోవడం లాంఛనమే కావచ్చు.