తండ్రి కెరీర్‌ను కాపాడేందుకు కూతుళ్ల కంక‌ణం

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గరుడ‌వేగ సినిమాతో ఫామ్ అందుకున్న‌ట్లే అందుకుని మ‌ళ్లీ వెనుక‌బ‌డిపోయారు. దాని త‌ర్వాత ఆయ‌న చేసిన క‌ల్కి తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. దీంతో కెరీర్లో మ‌ళ్లీ గ్యాప్ వ‌చ్చేసింది. త‌ర్వాతి సినిమా విష‌యంలో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌య్యారు. క‌ప‌ట‌ధారి ఆయ‌న చేయాల్సిన సినిమానే. కానీ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గారు.

భాయ్ ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్రం చౌద‌రితో ఓ సినిమా అనుకుని దాన్ని కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు. నీల‌కంఠ‌తో ఓ సినిమా అన్నారు కానీ.. అది కూడా ముందుకు క‌ద‌ల్లేదు. వ‌రుస‌గా రాజ‌శేఖ‌ర్ సినిమాలు మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోతున్నాయేంటి అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్‌లో రాజ‌శేఖ‌ర్ మూడు సినిమాల‌ను లైన్లో పెట్ట‌డం, ఆ మూడూ కూడా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తుండ‌టం విశేషం.

మ‌ల‌యాళ హిట్ మూవీ జోసెఫ్‌ను శేఖ‌ర్ పేరుతో రాజ‌శేఖ‌ర్ హీరోగా రీమేక్ సంగ‌తి తెలిసిందే. ల‌లిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని ప్రి లుక్ పోస్ట‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపించింది. మ‌రోవైపు కిర‌ణ్ అనే ద‌ర్శ‌కుడితో రాజ‌శేఖర్ హీరోగా మ‌రో కాప్ థ్రిల్ల‌ర్ రెడీ అవుతోంది. దీని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. ఇప్పుడేమో కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హాతో మ‌ర్మాణువు పేరుతో ఒక కొత్త సినిమాను ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు రాజ‌శేఖ‌ర్. ఈ క‌ల‌యిక ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

విశేషం ఏంటంటే రాజ‌శేఖ‌ర్ లైన్లో పెట్టిన ఈ మూడు చిత్రాల్లోనూ నిర్మాత‌లుగా ఆయ‌న కూతుళ్లు శివాని, శివాత్మిక‌ల పేర్లు ప‌డ‌టం విశేషం. వీళ్లిద్ద‌రూ వేరే నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి ఈ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంత‌కుముందు రాజ‌శేఖ‌ర్ ఏ సినిమా ప‌డితే అది చేసి క్రేజ్ పోగొట్టుకున్నారు. ఐతే ఈ త‌రానికి త‌గ్గ‌ట్లు ఆలోచించే కూతుళ్లు తండ్రి కెరీర్‌ను పైకి లేప‌డానికి కంక‌ణం క‌ట్టుకుని ఆస‌క్తిక‌ర ప్రాజెక్టులను లైన్లో పెట్ట‌డం టాలీవుడ్లో చ‌ర్చనీయాంశంగా మారింది.