బుకింగ్స్ లేవు.. షోలు క్యాన్సిల్

క‌రోనా బ్రేక్ త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ తెలుగు సినిమాల ప‌రిస్థితి చిత్రంగా ఉంటోంది. కొన్ని సినిమాలేమో వాటికి వ‌చ్చిన టాక్‌కు మించి ఇర‌గాడేస్తున్నాయి. డ‌బుల్, ట్రిపుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అయిపోతున్నాయి. మ‌రికొన్ని సినిమాల‌కేమో క‌నీస స్పంద‌న ఉండ‌ట్లేదు. థియేట‌ర్ల మెయింటైనెన్స్ మేర‌కు కూడా వ‌సూళ్లు రావ‌ట్లేదు.

సంక్రాంతికి క్రాక్ ఎలా ఆడేసిందో తెలిసిందే. గ‌త నెల‌లో ఉప్పెన‌, ఈ నెల‌లో జాతిర‌త్నాలు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సంచ‌న‌లాలు న‌మోదు చేస్తున్నాయో అంద‌రూ చూస్తున్నారు. ఈ సినిమాల ఊపు చూసి టాలీవుడ్ నిర్మాత‌లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. కానీ వాటిలో చాలా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ప్రేక్ష‌కులు ఏదో ఒక్క సినిమానే నెత్తిన పెట్టుకుంటూ.. ఏమాత్రం నెగెటివ్ టాక్ వ‌చ్చినా ఆ సినిమా జోలికి వెళ్ల‌ట్లేదు.

ఈ ప‌రిస్థితుల్లో గ‌త వారాంతంలో వ‌చ్చిన మూడు కొత్త చిత్రాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. గ‌త శుక్ర‌వారం రిలీజైన చావు క‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్ళు, శ‌శి చిత్రాలు వీకెండ్ అయ్యేస‌రికే వాషౌట్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చేసింది. వారాంతంలోనూ వీటికి స‌రైన వ‌సూళ్లు లేవు. చావు క‌బురు చ‌ల్ల‌గాకు ఓ మోస్త‌రుగా ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అవి కూడా తొలి రోజు వ‌రకే. త‌ర్వాత అది ప‌డ‌కేసేసింది. మిగ‌తా రెండు సినిమాల‌కు తొలి రోజే వ‌సూళ్లు లేవు. జాతిర‌త్నాలు పూర్తిగా వీకెండ్‌ను ఆక్ర‌మించేసింది. వ‌సూళ్ల పంట పండించుకుంది.

వీకెండ్ అయ్యాక మూడు కొత్త సినిమాకు 10-20 శాతం మ‌ధ్య కూడా ఆక్యుపెన్సీ లేదు. మ‌ల్టీప్లెక్సులు వీటికి స్క్రీన్లు బాగా త‌గ్గించేశాయి. ఉన్న‌వాటిలో కూడా మినిమం ఆక్యుపెన్సీ లేక ఎప్ప‌టిక‌ప్పుడు షోలు క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంది. సింగిల్ స్క్రీన్ల ద‌గ్గ‌రైతే ప‌రిస్థితి మ‌రీ దారుణం. సినిమాలు ఆడిస్తే మెయింటైనెన్స్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాలేని ప‌రిస్థితుల్లో ఊరుకుంటున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.