చిన్న ‘రౌడీ’ ఒక్క హిట్టు కొట్టాడో లేదో..

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెరంగేట్రం చేయడం ఇష్టమే లేదన్నట్లు.. అతడికి తాను పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదన్నట్లు విజయ్ దేవరకొండ అప్పట్లో ముచ్చట్లు బాగానే చెప్పాడు కానీ.. యావరేజ్ లుక్స్ ఉన్న ఆనంద్ హీరోగా పేరున్న బేనర్లలో లాంచ్ కాగలిగాడన్నా.. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తర్వాత అవకాశాలకు కొదవ లేదన్నా అందుకు విజయే కారణం అనడంలో సందేహమే లేదు.

‘దొరసాని’ డిజాస్టర్ అయ్యాక అతను ‘భవ్య క్రియేషన్స్’ లాంటి పెద్ద బేనర్లో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా చేయగలిగాడంటే అది విజయ్ బ్యాకప్ వల్లే. ఇక ఆ సినిమా మంచి విజయం సాధించేసరికి ఆనంద్ టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయాడు. కొన్ని నెలల వ్యవధిలోనే అతను ‘పుష్పక విమానం’ అనే మరో కొత్త సినిమాతో రెడీ అయిపోయాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ దశలో ఉన్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సోమవారం ఆనంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతను హీరోగా మూడు కొత్త చిత్రాలు అనౌన్స్ కావడం విశేషం. అవి పేరున్న సంస్థల్లో తెరకెక్కబోతున్నవే. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఆనంద్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతోంది. ‘గురు ఫిలిమ్స్’ అనే మరో బేనర్ ఈ చిత్రంలో భాగస్వామిగా ఉండనుంది. ఇక ‘దొరసాని’ తల బొప్పి కట్టించుకున్నప్పటికీ మధుర శ్రీధర్ రెడ్డి.. ఆనంద్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. రోల్ కెమెరా విజువల్స్ అనే బేనర్‌తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ మిత్రుడు కేదార్ సెలగంశెట్టి సైతం ఆనంద్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. వంశీ కారుమంచి అనే మరో నిర్మాత ఈ సినిమాలో భాగస్వామి కానున్నాడు. ఉదయ్ శెట్టి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఒక సినిమా హిట్టయ్యేసరికి ఆనంద్ ఇంత బిజీ అయిపోవడం విశేషమే.