తెలుగు సినిమానా మజాకా

కరోనా విరామం తర్వాత.. దేశంలోని మిగతా సినీ పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ చాలా ముందుగానే రీస్టార్ట్ అయిపోయింది. ఒకప్పట్లా టాప్ గేర్‌లోకి వెళ్లిపోయింది. కరోనా వల్ల అన్ని పరిశ్రమల్లాగే నష్టం చవిచూసినా.. పోస్ట్ కరోనా ఎరాలో మాత్రం టాలీవుడ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. కరోనా ముందు కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు సినిమాలు రిలీజవుతుండటం.. టాక్ బాగున్న సినిమాలకు ఒకప్పటి కంటే ఎక్కువగా వసూళ్లు వస్తుండటం విశేషం.

50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నపుడే ‘క్రాక్’ సినిమా రవితేజ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక కొత్త హీరో హీరోయిన్లతో కొత్త దర్శకుడు తీసిన ‘ఉప్పెన’ సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమాల విజయాలు పరిశ్రమకు ఎక్కడ లేని ఉత్సాహం తీసుకొచ్చాయి.

ఐతే కరోనా తర్వాత లోకల్‌గా మన సినిమాల మార్కెట్ బాగా పుంజుకుంది. ఒకప్పటి స్థాయిని మించింది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం మిగతా భాషల చిత్రాల్లాగే తెలుగు సినిమాలకూ మార్కెట్ పరంగా గండి పడింది.

ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే మినిమం పది కోట్లు పలికేవి హక్కులు. 20-25 కోట్ల రేటు కూడా వచ్చేది. కానీ ఇప్పుడు అంతేసి రేట్లు పెట్టే పరిస్థితి లేదు. కరోనా ప్రభావం యుఎస్‌లో ఇప్పటికీ బాగా కొనసాగుతుండటంతో మన సినిమాలు రిలీజయ్యే లొకేషన్లు, స్క్రీన్లు బాగా తగ్గిపోయాయి. వసూళ్ల మీద కూడా ఆ మేరకు బాగా ప్రభావం పడింది. మిలియన్ల లెక్కల గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. మళ్లీ అక్కడ మన సినిమాల మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో కూడా చెప్పడం కష్టంగా ఉంది.

ఐతే ఇక్కడ కోల్పోయిన ఆదాయాన్ని తెలుగు సినిమాలు మరో రకంగా పూడ్చుకుంటున్నాయి. కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి.. యూట్యూబ్‌లో, హిందీ ఛానెళ్లలో రిలీజయ్యే ఒరవడి బాగా పెరిగింది. థియేటర్లలో సైతం పాత వాటిని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కరోనా ప్రభావం తర్వాత కూడా హీరోల పారితోషకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయంటే ఇదో కారణం. రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలకు డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. కరోనా టైంలో మన డబ్బింగ్ సినిమాలకు గిరాకీ మరింత పెరిగింది. ఇప్పుడు డబ్బింగ్ హక్కుల రేట్లు మరింత పెరిగాయి. ఓవర్సీస్‌ హక్కుల విషయంలో పడ్డ గండిని నిర్మాతలు ఇక్కడ తీర్చేసుకుంటున్నారు.