నెట్‌ఫ్లిక్సా మజాకా.. ఈ ఏడాది సినిమాల మోతే

ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇండియాలోకి అడుగుపెట్టడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఇక్కడ ఆ సంస్థ దూకుడు మామూలుగా లేదు. ఆ సంస్థ దగ్గరున్న భారీ అంతర్జాతీయ కంటెంట్‌‌కు తోడు.. ఇండియన్ కంటెంట్‌ను బాగా పెంచడానికి భారీ ప్రణాళికలతోనే దూసుకెళ్తోంది. కరోనా-లాక్‌డౌన్ నెట్‌ఫ్లిక్స్‌కు బాగా కలిసొచ్చి ఇండియాలో సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. ఈ ఊపులో ఇండియన్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ మీద ఆ సంస్థ భారీగానే పెట్టుబడులు పెట్టి మరింత విస్తరించే పనిలో పడింది.

హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పెద్ద ఎత్తున కంటెంట్ జనరేట్ చేస్తోంది. తెలుగులోనూ ఇటీవలే ‘పిట్టకథలు’తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభం అయి మామూలుగానే నడుస్తున్న నేపథ్యంలో మిగతా ఓటీటీల జోరు కొంత తగ్గినట్లే ఉంది కానీ.. నెట్ ఫ్లిక్స్ మాత్రం కొత్త ఏడాదిలో భారీగా కంటెంట్ ఇవ్వబోతోందన్న స్పష్టమైంది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తంగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్‌లో 41 కొత్త రిలీజ్‌లు ఉండబోతుండటం విశేషం. వాటి వివరాలను నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘జగమే తంత్రం’తో పాటు సిద్దార్థ్-అరవింద్ స్వామి-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాంథాలజీ ఫిలిం ‘నవరస’తో పాటు హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హసీనా దిల్ రుబా’, రకుల్ ప్రీత్-అర్జున్ కపూర్‌ల ‘సర్దార్ కా గ్రాండ్ సన్’, బాబీ డియోల్-అర్జున్ రాంపాల్‌ల థ్రిల్లర్ మూవీ ‘పెంట్ హౌస్’.. ఇలా ఈ జాబితాలో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

ఇవి కాక ఢిల్లీ క్రైమ్-2, అరణ్యక్, ఫైండింగ్ అనామిక, మసాబా మసాబా-2 లాంటి పేరున్న వెబ్ సిరీస్‌లు చాలానే నెట్ ఫ్లిక్స్ అందించబోతోంది. వీటి షెడ్యూల్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే డేట్లు ప్రకటించనున్నారు. ‘జగమే తంత్రం’ ముందుగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఐతే ఈ 41 రిలీజ్‌ల్లో తెలుగు నుంచి ఏ సినిమా, సిరీస్ కానీ లేకపోవడమే విచారకరం.