2025లో దృశ్యం-3

పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి అనూహ్యమైన ఫలితాన్నందుకుంది ‘దృశ్యం-2’. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే ఆ కథను పొడిగించడానికి ఇంకేముంది అనుకున్నారు. పైగా ఈ సినిమాను నెలన్నరలో పూర్తి చేసేయడం, థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో దీనిపై అంచనాలు మరింత తగ్గాయి. ‘దృశ్యం’ సినిమాతో వచ్చిన పేరును క్యాష్ చేసుకోవడానికి చేసిన సినిమాలా కనిపించిందిది.

కానీ ‘దృశ్యం’కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అమేజాన్ ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘దృశ్యం-2’ నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో జీతు జోసెఫ్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఆయన వరుసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దృశ్యం-3’ గురించి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు జీతు.

‘దృశ్యం’ రిలీజైన టైంలో దీని సీక్వెల్ గురించి తాను ఆలోచించలేదని, అనుకోకుండా ఇప్పుడు ఆ సినిమా తీశానని.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో ఇలాగే ‘దృశ్యం-3’ తీసే అవకాశాలు లేకపోలేదని అన్నాడు జీతు. ఐతే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన మాట మారిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో ‘దృశ్యం-3’ కచ్చితంగా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారాయన. ‘దృశ్యం-3’కి తాను ఇప్పటికే క్లైమాక్స్ రాసేసినట్లు వెల్లడించి పెద్ద షాకే ఇచ్చాడు జీతు. కానీ ఈ సినిమా వెంటనే మాత్రం చేయబోనన్నాడు. పూర్తి స్క్రిప్టు తయారు చేయడానికి మూడేళ్లు పడుతుందని చెప్పాడు. సీక్వెల్‌కు ఆ మాత్రం గ్యాప్ కూడా అవసరమన్నాడు. 2025లో ‘దృశ్యం-3’ కార్యరూపం దాల్చే అవకాశమున్నట్లు చెప్పాడు.
ఐతే ‘దృశ్యం-2’ చూశాక మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ఆ కథ దీనికి భిన్నంగా ఏదైనా మలుపు తిరగాలి. మళ్లీ ఇదే స్టయిల్లో జార్జి కుట్టి పోలీసులను బురిడీ కొట్టిస్తే బాగుండదు. మరి ‘దృశ్యం-3’లో జీతు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.