‘ఉప్పెన’కు ఇవన్నీ సరిపోవని..

‘ఉప్పెన’ సినిమాకు ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా తొందరపడలేదు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. ఎంత ఆలస్యం అయినా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఆ పట్టుదల వారికి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తోంది. ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల షేర్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. రెండో వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. కొత్తగా రిలీజైన సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచింది. సెకండ్ వీకెండ్ అయ్యాక కూడా ఈ చిత్రానికి మంచి షేర్ వస్తోంది. మెజారిటీ ఏరియాల్లో ‘ఉప్పెన’ను సొంతంగా రిలీజ్ చేసిన మైత్రీ వాళ్లకు భారీ లాభాలు అందుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ ద్వారానే ఊహించని లాభాలు అందుకుంటున్న నిర్మాతలకు.. ఇతర మార్గాల్లోనూ పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వాళ్లకు మంచి రేటుకు డిజిటల్ హక్కులు అమ్మారు మైత్రీ అధినేతలు.

ఇంకా శాటిలైట్ హక్కులు అమ్మాల్సి ఉంది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో ఆ రైట్స్ కూడా మంచి రేటే పలికే అవకాశముంది. ఇక రీమేక్ హక్కుల ద్వారానూ ‘ఉప్పెన’ నిర్మాతల పంట పండించేలా ఉంది. ఇప్పటికే తమిళ రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. విజయ్ కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ‘ఉప్పెన’ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా హిందీ రీమేక్ గురించి కూడా వార్తలొస్తున్నాయి. ‘ఖాలి పీలి’ జంట ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే‌లతో ‘ఉప్పెన’ను హిందీలో రీమేక్ చేయడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతోందట. హిందీ రీమేక్ అంటే రేటు భారీగానే ఉంటుంది. ఇక తెలుగులో హిట్టయిన ప్రతి సినిమానూ రీమేక్ చేసే కన్నడ నిర్మాతలు కూడా ‘ఉప్పెన’ కోసం పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అనూహ్యమైన లాభాలందించిన ‘ఉప్పెన’.. అవన్నీ చాలవని ఇతర మార్గాల్లోనూ భారీగానే నిర్మాతలకు ఆదాయం సమకూర్చిపెడుతుండటం విశేషం.