‘ఉప్పెన’ దర్శకుడిని లాక్ చేసేశారు

ఉప్పెన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న సినిమా. పరిశ్రమలో కూడా ఈ సినిమా చర్చలే ఎక్కడ చూసినా. ఈ సినిమా తీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా పేరు కూడా మార్మోగిపోతోంది ఇండస్ట్రీలో. తొలి సినిమాతో హిట్టు కొడితే ఆ దర్శకుడి జాతకం ఒక్క రాత్రిలో మారిపోతుంది. రిలీజ్ రోజు సాయంత్రం నుంచే కాల్స్‌తో ఫోన్ మోత మోగిపోతుంది. అందులో అభినందనల కాల్స్‌తో పాటు ఆఫర్ల కాల్స్ కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. ఐతే ‘ఉప్పెన’ సినిమా ఔట్ పుట్ చూసి బుచ్చిబాబు టాలెంట్ ఏంటో పసిగట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. అతణ్ని వెంటనే బయటికి వదలకూడదని ఫిక్సయిపోయారట.

ప్రస్తుతం టాలీవుడ్లో ఫామ్‌లో ఉన్న ఏ దర్శకుడూ, ఏ హీరోనూ వదలుకుండా కమిట్మెంట్లు తీసుకుంటున్న మైత్రీ సంస్థ.. తమ సంస్థలోనే పరిచయం అయిన ప్రతిభావంతుడైన దర్శకుడిని ఎలా వదిలి పెడుతుంది? ‘ఉప్పెన’ రిలీజ్ కంటే ముందు అతడిని మైత్రీ అధినేతలు లాక్ చేసేసినట్లు సమాచారం.

బుచ్చిబాబు మరో రెండు సినిమాలు మైత్రీకే చేశాకే బయటికి వెళ్లేలా అగ్రిమెంట్ ఎప్పుడో రాయించేసినట్లు సమాచారం. బుచ్చిబాబు రెండో సినిమాకు కథ కూడా ఎప్పుడో రెడీ అయిందట. అది ఒక వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా అని తెలిసింది. లాక్ డౌన్ టైంలో బుచ్చిబాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఒక కథ చెప్పి ఇంప్రెస్ చేసినట్లు వార్తలొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో సైతం బుచ్చిబాబు టచ్‌లో ఉన్నాడు.

ఈ ఇద్దరిలో ఒకరిని బుచ్చిబాబు తర్వాతి సినిమాకు కమిట్ చేయించాలని మైత్రీ అధినేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో కుదరకుంటే ఇంకెవరైనా పెద్ద స్టార్‌తోనే బుచ్చిబాబు రెండో సినిమా చేయించాలని వారు భావిస్తున్నారట. మైత్రీతో ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే బుచ్చిబాబు ఇంకో రెండేళ్లకు పైగా ఆ కాంపౌండ్ దాటే అవకాశాలు కనిపించడం లేదు.

ఇప్పటిదాకా సుకుమార్ శిష్యులందరిలో అతి పెద్ద విజయాన్నందుకుంది, తన ముద్రను ప్రత్యేకంగా చూపించింది బుచ్చిబాబే. గురువుకు తగ్గ శిష్యుడంటే అతణ్ని ఇండస్ట్రీ జనాలు ఆకాశానికెత్తేస్తున్నారు. ఐతే తొలి సినిమాతో అంచనాలు పెంచాక సుకుమార్ సహా చాలామంది దర్శకులు ద్వితీయ విఘ్నంతో ఇబ్బంది పడ్డవాళ్లే. మరి బుచ్చిబాబు ఏం చేస్తాడో చూడాలి.