అశ్వినీదత్ కల.. అంత వీజీ కాదు

టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ మూవీస్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఈ సినిమా విడుదలై అప్పుడే 30 ఏళ్లు అయిందంటే ఆశ్చర్యం కలగక మానదు. అంత పాత సినిమా అయినా సరే.. ఇప్పుడు చూసినా నిత్యనూతనంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్లి వినోదంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాకు సీక్వెల్ తీయడం గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది.

అశ్వినీదత్ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా.. ఆ సినిమా గురించి, దాని సీక్వెల్ గురించి మాట్లాడతారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని రీమేక్ చేయాలన్నది ఆయన ఆలోచన. కథానాయికగా శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్‌ను తీసుకుంటే బాగుంటుందని కూడా గతంలో ఆయన ఓ సందర్భంలో అన్నారు. తాజాగా మరోసారి ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారాయన.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ తీశాకే రిటైరవుతానని.. త్వరలోనే దీని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు దత్. ఐతే ఇలాంటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ తీయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలుగులో పాత క్లాసిక్‌లను రీమేక్ చేసినా, సీక్వెల్స్ తీసినా ఎప్పుడూ సరైన ఫలితాలు దక్కలేదు. అప్పటి ట్రెండ్ వేరు. ఇప్పటి ట్రెండ్ వేరు. అప్పట్లో ఆ క్లాసిక్స్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో సీక్వెల్స్‌కు అంతగా కనెక్ట్ కారనే అభిప్రాయం ఉంది.

ఇక ఓల్డ్ క్లాసిక్స్ రీమేక్ చేసినా, సీక్వెల్ తీసినా.. వాటిని ఎంత మాత్రం మ్యాచ్ చేసిన దాఖలాలు టాలీవుడ్లో కనిపించవు. అంచనాల్ని అందుకోవడం అంత సులువు కాదు. ‘గాయం’, ‘చంద్రముఖి’, ‘మన్మథుడు’ లాంటి సినిమాల సీక్వెల్స్ ఎంత పేలవంగా తయారయ్యాయో తెలిసిందే. వీటి సంగతే అలా ఉంటే.. ‘జగదేకవీరుడు..’ లాంటి ఆల్ టైం క్లాసిక్ అంటే దానిపై ఉండే అంచనాల్ని అందుకోవడం అంత సులువు కాదు.

కాస్టింగ్ సంగతలా ఉంచితే.. ఇప్పుడు ఈ సీక్వెల్‌ను అంత ట్రెండీగా తీర్చిదిద్దే దర్శకుడెవరన్నది ప్రశ్న. రాజమౌళి లాంటి వాడైతే బాగుంటుంది కానీ.. ఆయనకున్న కమిట్మెంట్లను బట్టి చూస్తే ఈ సినిమా చేసే అవకాశం లేదు. కాబట్టి అశ్వినీదత్ కల నెరవేరడం అంత సులువు కాదనే అనిపిస్తోంది.