గుంటూరు టాకీస్ చేసి తప్పు చేశా

‘జబర్దస్త్’ టీవీ షో చేయడానికి ముందే కొన్నేళ్లుగా సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ వచ్చింది రష్మి గౌతమ్. కానీ ఆమెకు అప్పుడంత గుర్తింపు లేదు. కానీ ‘జబర్దస్త్’లో గ్లామర్ షో చేశాక ఆమెకు వచ్చిన గుర్తింపే వేరు. షో సూపర్ హిట్టవడం, రష్మికి ఎక్కడలేని పాపులారిటీ రావడం.. అంతలోనే సినిమా అవకాశాలు తలుపు తట్టడం చకచకా జరిగిపోయాయి.

బుల్లితెరపై చేసిన గ్లామర్ విందుకు మంచి రెస్పాన్స్ రావడంతో వెండితెరపైనా ఆమె అదే స్థాయిలో రెచ్చిపోయింది. ప్రవీణ్ సత్తారు డైెెరెక్ట్ చేసిన ‘గుంటూరు టాకీస్’లో రష్మి బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా రెచ్చిపోయి నటించింది. ఆమె బోల్డ్ యాక్ట్స్‌కు మంచి ఫలితం ఉంటుందని.. కెరీర్ మంచి ఊపందుకుంటుందని అనుకుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ సినిమా ఆమె కెరీర్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది.

‘గుంటూరు టాకీస్’లో బోల్డ్‌గా నటించి తప్పు చేశానేమో అని ఇప్పుడు ఫీలవుతోంది రష్మి. అందులో తన పాత్ర చూసి ఫిలిం మేకర్స్‌లో తప్పుడు అభిప్రాయం కలిగిందని.. వరుసగా అలాంటి బోల్డ్ క్యారెక్టర్లే ఇచ్చారని.. దీంతో పాత్రల్లో వైవిధ్యం లేక తాను చేసిన సినిమాలు బోల్తా కొట్టాయని.. తన కెరీర్‌కు బ్రేక్ పడిందని రష్మి చెప్పింది. ఇకపై తాను అలాంటి పాత్రలు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నట్లు రష్మి చెప్పింది.

ప్రస్తుతం టీవీ షోలు చాలానే చేస్తున్నానని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. ఒరిజినల్స్‌లో నటించే అవకాశముందని రష్మి చెప్పింది. ఇక తన ఆర్థిక పరిస్థితి గురించి అడిగితే.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నానని.. సెటిలైనట్లే అనిపిస్తున్నప్పటికీ.. ఇంకా తాను కోరుకున్న జీవితం రాలేదని రష్మి చెప్పింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వైజాగ్‌తో తన సొంతింట్లోనే ఉంటున్నానని.. వీధి కుక్కలకు రెండు పూటలా వండి పెట్టే పనితో తీరిక లేకుండా ఉన్నానని రష్మి చెప్పింది.