మైత్రి వారి చిరు, ప్రభాస్ ముచ్చట్లు


మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ స్థాయిలో టాలీవుడ్లో మరే బేనర్ కూడా సినిమాలు నిర్మించట్లేదు. క్వాలిటీ, క్వాంటిటీ.. ఇలా ఏ రకంగా చూసినా మైత్రి వారికి సాటి వచ్చే బేనర్ ఇంకోటి కనిపించడం లేదు ప్రస్తుతం. టాలీవుడ్ టాప్ స్టార్లు, డైరెక్టర్లందరితోనూ సినిమాలు చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమాలు చేసిన ఆ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవిల సినిమాలనూ లైన్లో పెట్టేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ సంస్థలో అడుగు పెడుతున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘సలార్’ తర్వాత తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తారక్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. మరోవైపు ‘ఉప్పెన’ ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా మైత్రీలోనే తెరకెక్కుతుందని ధ్రువీకరించాడు.

చిరుతో చేయబోయే సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మాట్లాడారు. చిరు కెరీర్లో బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి సినిమాల ఛాయలు ఇందులో ఉంటాయని.. వింటేజ్ చిరును ఇందులో చూస్తారని వారు చెప్పారు.

నవీన్ మాట్లాడుతూ.. తనకు బేసిగ్గా కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టమని, చిరుతో పక్కా కమర్షియల్ సినిమా చేయాలనే అనుకున్నామని, అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చిరు ఇందులో కనిపిస్తారని అన్నారు. మరోవైపు ప్రభాస్‌తో కూడా తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు చెప్పారు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో ప్రభాస్‌కు కథలు చెప్పిస్తున్నామని, ఈ ఏడాది చివర్లోపు ఏదో ఒక కథ ఓకే అవుతుందని.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు పూర్తి కాగానే.. తమ సంస్థలోనే అతను సినిమా చేస్తాడని నవీన్ అన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గట్లే భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు.