హీరో సూర్య‌కు క‌రోనా

ఫ‌లానా నాయ‌కుడికి క‌రోనా.. ఫ‌లానా ఫిలిం సెల‌బ్రెటీకి పాజిటివ్ అనే వార్త‌లు ఈ మ‌ధ్య బాగా త‌గ్గిపోయాయి. దేశంలో, మ‌న తెలుగు రాష్ట్రాల్లో రోజు వారీ కేసులెన్ని, మ‌ర‌ణాలెన్ని అనే లెక్క‌ల్ని ప‌ట్టించుకోవ‌డం కూడా ఎప్పుడో మానేశాం. దేశంలో వైర‌స్ ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గిన సంగ‌తి స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పుడంతా వ్యాక్సినేష‌న్ హ‌డావుడే న‌డుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో త‌మిళ స్టార్ హీరో సూర్య క‌రోనా బారిన ప‌డ్డాడ‌న్న వార్త ఇప్పుడు అత‌డి అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంలో ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, పాజిటివ్ వ‌చ్చింద‌ని సూర్య ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించాడు. వైర‌స్ ముప్పు ఇంకా పూర్తిగా తొల‌గిపోలేద‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూర్య విజ్ఞ‌ప్తి చేశాడు. త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూర్య సూచించారు.

అభిమానులు ఆందోళ‌న చెందవ‌ద్ద‌ని, తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని సూర్య ధీమా వ్య‌క్తం చేశాడు.
గ‌త ఏడాది ఓటీటీ రిలీజ్ ఆకాశం నీ హ‌ద్దురాతో పెద్ద విజ‌యాన్నే అందుకున్నాడు సూర్య‌. చాలా ఏళ్ల త‌ర్వాత సూర్య‌కు ద‌క్కిన హిట్ ఇది. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లై ఉంటే ఇంకా బాగుండేది. భారీ విజ‌యాన్నందుకునేది. ఈ చిత్రం వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డుల‌కు కూడా నామినేట్ కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం సూర్య‌ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో గ్యాంగ్ లీడ‌ర్ భామ ప్రియాంక అరుల్ మోహ‌న్ క‌థానాయిక‌. బ‌హుశా ఈ సినిమా చిత్రీక‌ర‌ణలో పాల్గొంటుండ‌గానే సూర్య క‌రోనా బారిన ప‌డి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు.