అయ్యో.. ఆదిపురుష్ సెట్లో తొలి రోజే

ప్ర‌భాస్ హిందీలో చేస్తున్న తొలి చిత్రం ఆదిపురుష్ మంగ‌ళ‌వార‌మే ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తానాజీ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ చిత్రం తెర‌కెక్కుతోంది. ముహూర్తం రోజే ఎంతో ఉత్సాహంగా షూటింగ్ కూడా మొద‌లుపెట్టింది చిత్ర బృందం. కానీ తొలి రోజు అనుకోని ఘ‌ట‌న ఆదిపురుష్ టీంను నిరాశ‌లో ముంచెత్తింది. ముంబ‌యిలోని గోరెగావ్‌లో ఆదిపురుష్ సినిమా కోసం తీర్చిదిద్దిన భారీ సెట్లో పెద్ద అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాదానికి కార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ.. సెట్లో భారీగా ఎగ‌సిప‌డుతున్న అగ్ని కీల‌ల‌కు సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఐతే అదృష్ట‌వ‌శాత్తూ కాస్ట్ అండ్ క్రూలో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లు వ‌చ్చి మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో ప‌డ్డాయి. ఈ భారీ చిత్రానికి ప్రారంభోత్స‌వం జ‌రిపిన తొలి రోజే ఇలా జ‌ర‌గ‌డం చిత్ర బృందంతో పాటు ప్ర‌భాస్ అభిమానుల‌ను బాధ పెడుతోంది. రామాయ‌ణ గాథ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఈ అప‌శ‌కునం ఏంటి అని కూడా చ‌ర్చించుకుంటున్నారు. నిన్న‌టిదాకా స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న ప్ర‌భాస్ ఆదిపురుష్ ప్రారంభోత్స‌వం కోస‌మే ఈ రోజు ముంబ‌యి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీత‌గా ప్ర‌భాస్ స‌ర‌స‌న కృతి స‌న‌న్ న‌టించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌కు హేమ‌మాలిని పేరు ప్ర‌చారంలో ఉంది. గుల్ష‌న్ కుమార్, మ‌రో ముగ్గురు నిర్మాత‌ల‌తో క‌లిసి స్వ‌యంగా ఓం రౌతే ఆదిపురుష్‌ను నిర్మిస్తున్నాడు. దీని బ‌డ్జెట్ దాదాపు రూ.500 కోట్ల‌ని అంటున్నారు.