ఇది ఓటీటీకి.. అది మాత్రం థియేటర్లలో

తమిళ స్టార్ హీరో ధనుష్‌కు ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. అతడితో సినిమాలు తీసిన ఇద్దరు నిర్మాతలు భిన్నంగా ఆలోచించడంతో అతడికి తలనొప్పి తెచ్చి పెట్టింది. కరోనా-లాక్‌డౌన్ కంటే ముందు ధనుష్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ‘జగమే తంత్రం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గత ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. మధ్యలో ఓటీటీల నుంచి చాలానే ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం తొణకలేదు. థియేటర్లలోనే తమ సినిమా విడుదలవుతుందని ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకుని నెలలు గడుస్తున్నా ‘జగమే తంత్రం’ను విడుదల చేయట్లేదు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చింది కూడా. అదే సమయానికి ‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్ అంటూ వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వాళ్లకు అమ్మేశారని.. త్వరలోనే ప్రిమియర్స్ పడబోతున్నాయని అంటున్నారు.

ఈ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించకపోవడంతో ధనుష్ అభిమానులు మంటెత్తి పోతున్నారు. థియేట్రికల్ రిలీజ్ కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తే ఇప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారా అంటూ నిన్నట్నుంచి సోషల్ మీడియాను హోరెత్తించేస్తున్నారు. కానీ ‘జగమే తంత్రం’ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే ఆదివారం ధనుష్ నటించిన మరో సినిమా ‘కర్ణన్’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్లో విడుదలవుతుందంటూ ఒక ఆసక్తికర టీజర్ వదిలారు. ధనుష్ కత్తి పట్టి రణరంగానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఆ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఏప్రిల్లో ‘థియేటర్లలోనే’ రిలీజవుతుందని నొక్కి వక్కాణించారు.

‘కర్ణన్’ థియేటర్లలో వస్తుందంటే తన అభిమానులు శాంతిస్తారన్న ఉద్దేశంతో ధనుష్ ఈ ప్రకటన చేయించాడో ఏమో కానీ.. వాళ్లయితే తమ ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారు. ‘జగమే తంత్రం’ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఆ దిశగా డిమాండ్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కొనసాగిస్తున్నారు.