‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌పై తీవ్ర అభ్యంతరం

సస్పెన్సుకు తెరదించుతూ అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది జక్కన్న అండ్ టీం. దీని గురించి ఘనంగా ప్రకటన చేశారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చిన నేపథ్యంలో ఈసారి మాత్రం పక్కాగా ఆ తేదీకే సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ సినిమాకు దసరా వీకెండ్‌ను ఎంచుకోవడం ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాతకు అస్సలు రుచించలేదు. ఆయనెవరో కాదు.. శ్రీదేవి భర్త బోనీకపూర్.

ప్రస్తుతం తెలుగులో దిల్ రాజుతో కలిసి ‘వకీల్ సాబ్’ను నిర్మిస్తున్న బోనీ.. హిందీలో ‘మైదాన్’ అనే భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్లో సినిమా మొదలైనపుడే రిలీజ్ డేట్ ఖరారు చేస్తుంటారు. ‘మైదాన్’కు కూడా అలాగే అక్టోబరు 15ను విడుదల తేదీగా ఎంచుకున్నారు.

ఐతే ఆ విషయం తెలిసీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను దసరా వీకెండ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడం పట్ల బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని పేరు సంపాదించిన రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమాకు హాలిడే వీకెండ్ అవసరం లేదని, ఏ డేట్ ఎంచుకున్నా పర్వాలేదని.. తమ సినిమా దసరా వీకెండ్లో రాబోతోందని తెలిసి కూడా ‘ఆర్ఆర్ఆర్’ను దానికి పోటీగా నిలపడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణే ‘మైదాన్’లో హీరో. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి పోటీ పడటం కూడా సరి కాదని బోనీ అభిప్రాయం.

పైగా ‘మైదాన్’ అజయ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ వల్ల దానికి ఇబ్బంది ఎదురైతే అజయ్ ఎలా ఊరుకుంటాడని బోనీ ఉద్దేశం. అజయ్‌కు తెలియకుండానే ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ డేట్ ఇచ్చి ఉంటుందని, దీనిపై అతను కినుక వహించాడని, అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టలేదని అంటున్నారు.