తాండ‌వ్ గొడ‌వ‌.. నాలుక తెస్తే కోటి

అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన తాండవ్ వెబ్ సిరీస్‌పై మొద‌లైన వివాదం ఒక ప‌ట్టాన స‌మ‌సిపోయేలా లేదు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా కొన్ని సన్నివేశాలు పెట్టారని.. హిందూ దేవుళ్లను కించపరిచారని ఈ సిరీస్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. న‌డుస్తూనే ఉంది. కొందరు రాజకీయ నాయకులు సైతం ఈ దిశ‌గా డిమాండ్లు చేశారు.

విష‌యం తీవ్ర‌త అర్థం చేసుకున్న తాండ‌వ్ మేక‌ర్స్‌.. సిరీస్‌లో అభ్యంత‌ర‌క‌రంగా ఉన్న స‌న్నివేశాల‌పై పశ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. సిరీస్ టీం అంతా క‌లిసి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ కూడా చెప్పారు. అయినా కూడా ఈ వివాదం చ‌ల్లార‌లేదు.

తాజాగా మ‌హారాష్ట్ర క‌ర్ణిసేన తాండవ్ వివాదంపై సంచ‌ల‌న రీతిలో స్పందించింది. ఈ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్లు, దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి నాలుక కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు క‌ర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ ప్రకటన చేయ‌డం గ‌మ‌నార్హం. ‘తాండవ్’ దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పినప్పటికీ అది సరిపోదని, ఆ క్షమాపణలను తాము అంగీకరించబోమని ఆయ‌న‌ తేల్చి చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేపుతోంది.

కాగా.. తాండవ్ వెబ్ సిరీస్‌లో హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీసే స‌న్నివేశాలు పెట్టినందుకు గాను అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ ఇండియా హెడ్ అలీ అబ్బాస్ జాఫర్, వెబ్ సిరీస్ నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రచయిత సోలంకి త‌దితరులపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.