హీరో, డైరెక్టర్ పారితోషకాలకే సగం బడ్జెట్

టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి హీరోలదే హవా. ఈ మధ్య అయితే వారి ఆధిపత్యం మరీ ఎక్కువైంది. వాళ్లు ఏం చెబితే అది జరగాల్సిందే. పారితోషకం కింద ఎంతడిగితే అంత ఇవ్వాల్సిందే. కరోనా నేపథ్యంలో అందరూ పారితోషకాలు తగ్గించాలన్న తీర్మానాలు జరిగాయి కానీ.. హీరోలకు అది పెద్దగా వర్తించలేదన్నది ఇండస్ట్రీ టాక్.

ఎందుకంటే హీరోల డేట్లు దొరకడమే మహా భాగ్యం అన్నట్లుగా ఉంటోంది నిర్మాతల పరిస్థితి. చేతిలో డబ్బులు లేకపోయినా హీరోల డేట్లు దొరికాయంటే చాలు.. ఆటోమేటిగ్గా ఫైనాన్స్‌లు రెడీ అయిపోతాయి. ఒక పెద్ద దర్శకుడితో కాంబినేషన్ సెట్ చేస్తే సినిమాకు క్రేజ్ వచ్చేస్తుంది. బయ్యర్ల నుంచి అడ్వాన్స్‌ల రూపంలో బడ్జెట్ సెట్ అయిపోతుంది.

ఇప్పుడు చాలామంది నిర్మాతలు ఇలాగే సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోలకు, దర్శకులకు పారితోషకాలు అంతకంతకూ పెంచేస్తున్నారు. వీళ్లిద్దరి పారితోషకాలే బడ్జెట్లో సగం, అంతకంటే ఎక్కువ కేటాయిస్తుండటం విశేషం.

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప’ సినిమాకు పెడుతున్న మొత్తం ఖర్చులో సగం కంటే ఎక్కువే హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల రెమ్యూనరేషన్‌కు కేటాయించినట్లు సమాచారం. ‘అల వైకుంఠపురములో’తో బన్నీ, ‘రంగస్థలం’తో సుకుమార్ నాన్-బాహుబలి హిట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్ గురించి చెప్పేదేముంది?

ఇద్దరూ తమ గత సినిమాలను మించి, రికార్డు స్థాయి పారితోషకాలు పుచ్చుకుంటున్నారట. ‘పుష్ప’ బడ్జెట్ వంద కోట్ల పైమాటే కాగా.. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ, సుకుమార్‌లకు కలిపి తక్కువలో తక్కువ రూ.50 కోట్లు ముట్టబోతున్నాయట. ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి, తర్వాత లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నారట.

సుకుమార్‌కు మాత్రమే పాతిక కోట్లకు అటు ఇటుగా వర్కవుట్ కావచ్చని అంటున్నారు. సినిమా అనుకున్నట్లుగా ఆడితే బన్నీకి రూ.30 కోట్లకు పైగానే అందుతుందని అంటున్నారు. ఈ సినిమాకు ఈజీగా రూ.150 కోట్ల దాకా బిజినెస్ అయ్యే అవకాశాలున్నాయి.