ఏడేళ్ల ముందు సినిమా రిలీజవబోతోందా?

సందీప్ కిషన్ హీరోగా తొలి అడుగులు వేస్తున్న టైంలో మొదలైన సినిమా ‘డీకే బోస్’. సినిమా అంతా పూర్తయింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఎందుకో తెలియదు. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

అందరూ దాని గురించి మరిచిపోయారు. ఇక ఆ చిత్రం చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా మొదలైన ఏడేళ్ల తర్వాత ‘డీకే బోస్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ మేరకు సంకేతాలిచ్చాడు.

కొన్ని సినిమాలకు ‘అహెడ్ ఆఫ్ టైమ్స్’ అని కామెంట్ వస్తుందని.. ‘డీకే బోస్’ అలాంటి సినిమానే అని.. మంచికో చెడుకో ఆ సినిమా విడుదల ఆలస్యం అయిందని.. ఆ కథను చెప్పడానికి ఇదే సరైన సమయం అని ట్వీట్ చేసిన హరీష్.. మే 7వ తేదీ వరకు అప్ డేట్ కోసం ఎదురు చూడాలని సస్పెన్సులో పెట్టాడు.

ఇన్నేళ్లు వాయిదా పడ్డ సినిమా థియేటర్లలోకి రావడం అంటే కష్టమే. అందులోనూ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ‘డీకే బోస్’ను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్ చేసే అవకాశముంది. దానికి సంబంధించిన అప్ డేటే ఇవ్వబోతున్నట్లున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ బోస్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. సందీప్ సరసన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నటించింది. సంపత్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.

‘ఓయ్’ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు. ఇది ఒక పోలీస్ స్టోరీ. చాలా అగ్రెసివ్‌గా ఉండే యువ పోలీస్‌కు, ఒక గూండాకు మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మరీ పాత పడ్డ చిత్రంలా అయితే కనిపించడం లేదు. మరి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.