టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆ చిత్ర దర్శకుడు మదిమారన్ పుహళేంది వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. సుహాస్ రంగు గురించి తమ దగ్గర రేసిస్ట్ కామెంట్లు చేస్తున్నారంటూ సుహాస్ తన వద్ద ఫీలయ్యాడని, తమిళంలో అలాంటి వివక్ష ఉండదని, తెలుగు వాళ్లు ఛాన్సులివ్వకపోతే తమ దగ్గరే అతణ్ని ఉంచేసుకుంటామని మదిమారన్ వ్యాఖ్యానించడం.. మన వాళ్లకు మంట పుట్టించింది.
సుహాస్కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం తగ్గింది.. అతడి మీద వివక్ష ఏంటి అంటూ మన వాళ్లు మండిపడ్డారు. ఐతే వివాదం గురించి మాట్లాడకుండా.. తనకు ఇక్కడ దక్కిన ప్రోత్సాహం గురించి ప్రస్తావిస్తూ సుహాస్ తెలుగు ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెబుతూ ఒక నోట్ రిలీజ్ చేయగా.. దాని మీద మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఐతే నేరుగా సుహాస్ వివాదాస్పద కామెంట్లు ఏమీ చేయలేదు కాబట్టి తన నుంచి ఇంతకంటే ఆశించలేం. ఐతే వివాదానికి కారణమైన దర్శకుడు మదిమారన్.. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, వివరణ ఇచ్చాడు. తాను సుహాస్ కోసమే, తన గురించి పాజిటివ్గానే మాట్లాడానని.. అతడి గురించి ఒక వ్యక్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రమే ప్రస్తావించానని.. అంతే తప్ప మొత్తం తెలుగు కమ్యూనిటీని నిందించలేదని.. తెలుగు ఇండస్ట్రీ పట్ల, ప్రేక్షకుల పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని మదిమారన్ చెప్పాడు.
మండాడి తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా తాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని నడిపిస్తోందే తెలుగు సినిమా అని వ్యాఖ్యానించానని.. మండాడికి అక్కడి నుంచి అద్భుత స్పందన వస్తోందని, తన మీదా ఎంతో ప్రేమ చూపించారని.. అలాంటి వాళ్లను తాను విమర్శిస్తానా అని మదిమారన్ ప్రశ్నించాడు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయనుకంఉటే అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మదిమారన్ చెప్పాడు. సూరి హీరోగా నటించిన మండాడిలో సుహాస్ విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఇప్పటికే 80 కోట్ల వసూళ్లు సాధించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates