ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్. ఆయన తనయుడు జేసన్ సంజయ్ నటుడిగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ముందే.. దర్శకుడిగా మారాడు. విజయ్ సీఎం అయిన కొన్ని నెలలకే తన తొలి చిత్రం ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటించాడు. తమిళంలో ఎంతోమంది స్టార్లు ఉన్నారు. విజయ్ కొడుకు అడిగితే వాళ్లలో ఎవ్వరూ కాదనేవారు కూడా కాదు. అయినా సందీప్‌నే అతను ఏరికోరి హీరోగా ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. ఇది తనకు కూడా షాకింగే అని ‘సిగ్మా’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు సందీప్.

అసలీ సినిమాలో తనకెలా అవకాశం వచ్చిందో అతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తొలి చిత్రం ‘మానగరం’లో తనే హీరో అని.. ఆ సినిమా చేశాక కూడా తనతో స్నేహం కొనసాగిందని.. అతను ‘లియో’ సినిమా ఓపెనింగ్‌కు తాను వెళ్లానని సందీప్ చెప్పాడు.

ఒకింత మొహమాటంలోనే ఆ వేడుకకు చివర్లో వెళ్లానని.. ముహూర్తం అయి భోజనాలు చేస్తున్న సమయంలో విజయ్ తనను పిలుస్తున్నాడని లోకేష్ చెబితే, ఆశ్చర్యపోతూ ఆయన దగ్గరకు వెళ్లానని సందీప్ వెల్లడించాడు. అప్పుడాయన తాను నటించిన ‘మానగరం’లో కొన్ని సన్నివేశాల గురించి.. అలాగే తాను నటించిన వేరే సినిమాల గురించి మాట్లాడితే నమ్మశక్యంగా అనిపించలేదని సందీప్ తెలిపాడు.

అప్పుడే తన కొడుకు జేసన్ సంజయ్‌కి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి తనకు పరిచయం చేశాడని.. ఐతే విజయ్ తన పెర్ఫామెన్స్‌ను మెచ్చుకున్నాడని, సంజయ్‌కి తనంటే ఇష్టమని బయట చెప్పుకుంటే ఎగతాళి చేస్తారనే భయంతో అప్పుడు ఆ విషయాలేవీ బయటికి చెప్పలేనని.. లోకేష్ కనకరాజ్ కూడా ఈ విషయంలో తనను వారించాడని సందీప్ చెప్పాడు. ఐతే ఇప్పుడు సంజయ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమాలో తనే హీరోగా నటించా కాబట్టి ధైర్యంగా విషయం చెప్పుకోగలుగుతున్నానని సందీప్ అన్నాడు.