జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్ బాబు యుద్ధాన్ని రుద్ర, రాముడి గెటప్స్ లో చూపిస్తాడు. ఇంకొకరేమో అదుర్స్ లో చారిని, మనీలో ఖాన్ దాదాని కలిపి బ్రహ్మానందం లవ్ స్టోరీ సృష్టిస్తాడు. మరొకరు 1980స్ లో మన టాలీవుడ్ హీరోలు కాలేజీకి వెళ్లి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఒక అందమైన వీడియో తయారు చేస్తారు. యెషనాగుల కట్టకు బాలయ్య, రవితేజ డాన్స్ మిక్స్ చేసిన మహానుభావులున్నారు.
ఇదంతా ప్రాథమిక దశలో సరదాగానే అనిపించవచ్చు. కానీ ఒక భవిష్యత్తు హెచ్చరికగా చూడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ప్రాధమిక పరిజ్ఞానంతోనే నెటిజెన్లు ఇంత క్రియేటివిటీ చూపిస్తే వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్న నిర్మాతలు తెరమీద ఇంకెంత క్వాలిటీ చూపించాలి. ఈ మధ్య పరిస్థితి ఎలా అయిపోయిందంటే టీజర్లతోనే జనాలు నిర్మొహమాట తీర్పులు ఇచ్చేసి మేకర్స్ ని భయపెడుతున్నారు. చిరంజీవి విశ్వంభర కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు.
ఏఐ పుణ్యమాని విఎఫ్ఎక్స్ మెల్లగా అరచేతుల్లోకి వస్తోంది. ఇదంతా ముందుగానే ఊహించి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు తమ ఫోటోలు, వీడియోల మీద కోర్టు నుంచి రక్షణ కల్పించుకున్నారు. అయినా సరే అన్నింటిని కంట్రోల్ చేయడం అసాధ్యం. అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవడం జరగని పని. చట్టాలు ఇంకా కఠినం కావాలి. దానికి మరింత సమయం పడుతుంది. ఈలోగా జరిగే డ్యామేజ్ ఎంత ఉంటుందనేది మాటలకు అందడం లేదు.
ఇప్పటికేదో ఈ వ్యవహారమంతా నవ్వులాటగా కనిపించవచ్చు. కానీ ఫ్యూచర్ ఇలా ఉండదు. సపోజ్ ఏదైనా సినిమాలో ఫలానా ఎపిసోడ్ బాగా రాలేదనుకుందాం. అప్పుడో ఏఐ యుజర్ ఎలా ఉండాలో చూపించేందుకు దాని కన్నా మెరుగ్గా ఏదైనా వీడియో చేసి, అది వైరలయ్యి మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది అనుకుందాం. అప్పుడు ఒరిజినల్ దర్శకుడు పడే నరకయాతన అంతా ఇంతా కాదు. వాళ్ళను ఎలా ఆపాలి అనేదాని కన్నా ఎవరు అందుకోలేనంత గొప్ప క్వాలిటీని మనం ఎలా ఇవ్వాలనే దాని మీద దృష్టి పెట్టడం ఒకటే దీనికి పరిష్కారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates